శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2020 (10:41 IST)

భారత్‌లో అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్ జియో

దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్ జియో అవతరించింది. అంటే వినియోగదారుల సంఖ్యాపరంగా అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఈ విషయాన్ని ట్రాయ్‌ తాజా గణాంకాలు వెల్లడించాయి. జియో సేవలు అందుబాటులోకి రాకమునుపు ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెల్సిందే. 
 
2019 నవంబర్ నాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరుకుందని ట్రాయ్ తెలిపింది. జియో తర్వాతి స్థానంలో 33.62 కోట్ల మంది వినియోగదారులతో వొడాఫోన్‌ ఐడియా, 32.73 కోట్ల వినియోగదారులతో ఎయిర్‌‌టెల్‌ నిలిచాయి. 
 
అక్టోబరు నాటికి దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య 120.48 కోట్లుండగా, నవంబర్‌ ముగిసేసరికి ఆ సంఖ్య 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు చేరుకున్నట్టు ట్రాయ్ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. అయితే, వొడాఫోన్ ఇండియా 36 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయినప్పటికీ రెండో స్థానంలో కొనసాగడం గమనార్హం. 
 
కాగా, ఇటీవల రిలయన్స్ జియో ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు అందిస్తున్న సేవలపై చార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. దీంతో అనేక మంది వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు వెళుతున్నారు. అయినప్పటికీ రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.