ఎలక్ట్రిక్ స్కూటర్కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి
ఇటీవలికాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లలోని బ్యాటరీలు పేలిపోతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఎలక్ట్రిక్ స్కూటర్కు చార్జింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు భారీ అగ్నిప్రమాదానికి దారితీశాయి. ఫలితంగా ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.
ఎలక్ట్రికల్ బైక్లో చెలరేగిన మంటలు బహుళ అంతస్తుల భవనానికి వ్యాపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 100 మందికి పైగా నివాసితులను ఖాళీ చేయించి మంటలను అదుపు చేశారు. పొగతో ఊపిరాడక ఇద్దరు అనారోగ్యానికి గురికాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళ ఉన్నారు.
నోయిడాలోని సెక్టార్ 66లోని మముర గ్రామంలో ఓ భవనంలో ఎలక్ట్రిక్ స్కూటర్ను ఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు నోయిడా సెంట్రల్ డీసీపీ వెల్లడించారు. ఈ మంటలు ఆ తర్వాత పెట్రోల్ వాహనాలకు అంటుకొని.. పై అంతస్తులకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
