శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జులై 2022 (14:46 IST)

పవిత్ర అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం

amarnath yatra
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సాగుతున్న అమర్నాథ్ యాత్రను తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలు రావడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో అనేక మంది భక్తులు కొట్టుకునిపోయి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతయ్యారు. వీరిలో అనేక మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి. దీనికితోడు భారత ఆర్మీ, వైమానిక సిబ్బంది, ఐటీబీపీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన అమర్నాథ్ యాత్ర మార్గాన్ని సిద్ధం చేశారు. అలాగే, మంచు శివలింగం ఉండే గుహ వద్ద మట్టి, రాళ్లను భద్రతా సిబ్బంది తొలగించారు. దీంతో ఈ యాత్ర చేసేందుకు భక్తులకు అనుమతిచ్చారు. 
 
మరోవైపు, గువవద్ద టోకెన్లు జారీచేసి శివలింగ దర్శనానికి పంపుతున్నారు. అమర్నాథ్ గుహకు పంత్‌తర్నీ వైపు నుంచి వెళ్లాలని, దర్శనం అనంతరం బల్తాల్ మార్గంలో వెనక్కి రావాలని సూచిస్తున్నారు. కాగా, ఈ ఆకస్మిక వర్షాలకు ముందు దాదాపు 1.13 లక్షల మంది అమర్నాథ్ యాత్రా భక్తులు మంచు శివలింగాన్ని దర్శనం చేసుకున్నారు.