సుప్రీంకోర్టు తీర్పుకు తాత్కాలిక బ్రేక్ : నీట్పై ఆర్డినెన్స్.. కేంద్రం సంచలన నిర్ణయం
దేశంలో వైద్య సీట్ల భర్తీకోసం జాతీయ స్థాయిలో జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)ను తప్పనిసరి చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడే ఒక యేడాది పాటు కేంద్రం బ్రేక్ వేసింది. ఈ తీర్పుతో ఈ యేడాది నుంచి నీట్ ప్రకారం అడ్మిషన్లు జరగాల్సి ఉండగా, ఒక యేడాది పాటు నీట్ అమలును నిలుపుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకుని రావాలని నిర్ణయించింది. ఈ సంచలన నిర్ణయంతో నీట్ ఏడాది పాటు వాయిదా పడనుంది.
శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఇందులో నీట్పై ఆర్డినెన్స్, సివిల్ ఏవియేషన్స్ పాలసీపై ప్రధానంగా చర్చించారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు తీర్పుకు లోబడి చట్టబద్దంగా నీట్ను ఏడాది పాటు వాయిదా వేసేందుకే కేబినెట్ మొగ్గుచూపింది. నీట్పై ఆర్డినెన్స్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపిచనున్నారు.
ఆర్డినెన్స్పై రాష్ట్రపతి సంతకం అనంతరం నీట్ను అన్ని రాష్ట్రాల్లో ఏడాది పాటు వాయిదా వేయాల్సి ఉంటుంది. నీట్ వాయిదా ఏపీ, తెలంగాణలో ఎంసెట్ రాసిన విద్యార్థులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇటీవల జేపీనడ్డా నేతృత్వంలో జరిగిన ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశంలో, అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలోనూ నీట్కు ఈ ఏడాది మినహాయింపు ఇవ్వాల్సిందేనంటూ ముక్తకంఠంతో కోరిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఈ సంచలనం నిర్ణయం తీసుకుంది.