1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 జులై 2025 (12:25 IST)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

chidambaram
గత ఏప్రిల్ నెలలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దాడికి పాల్పడింది మన దేశానికి చెందిన ఉగ్రవాదులేనన్నారు. ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చారని కేంద్రం ఎలా నిర్ధారించిందని ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. 
 
పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు జరుపుతున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎన్ఐఏ) ఇప్పటివరకూ ఎలాంటి నివేదిక ఇవ్వలేదని గుర్తుచేశారు. దర్యాప్తు వివరాలను ప్రభుత్వం కూడా బయటపెట్టడంలేదని, ఇన్ని రోజులు గడిచినా ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోలేదేమని నిలదీశారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను అసలు గుర్తించారా..? ఇన్ని రోజులుగా ఎన్ఐఏ అధికారులు ఏంచేస్తున్నారు? ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని ఎలా నిర్ధారించారు? దానికి ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలేంటి? దర్యాప్తు వివరాలను కేంద్రం ఎందుకు బయటపెట్టడంలేదు? అంటూ చిదంబరం పలు ప్రశ్నలు సంధించారు. 
 
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారనే ఆరోపణలతో పలువురు స్థానికులను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. వారి పరిస్థితి ఏమైందని, విచారణలో వారు వెల్లడించిన వివరాలను కేంద్రం బయటకు వెల్లడించకపోవడానికి కారణమేంటని చిదంబరం ప్రశ్నించారు.
 
ఆపరేషన్ సింధూర్ పైనా చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడుల సందర్భంగా పొరపాట్లు దొర్లాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బహిరంగంగానే అంగీకరించారని చిదంబరం పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన దేశానికి జరిగిన నష్టాన్ని కేంద్రం ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతోందని ఆరోపించారు. యుద్ధంలో రెండు వైపులా నష్టం వాటిల్లుతుందనే విషయం అందరికీ తెలుసని చిదంబరం పేర్కొన్నారు.