గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 మే 2020 (10:11 IST)

సీఎం ఆఫీసుగా వేద నిలయం? అమ్మ ఆస్తులకు వారసులు వీరే!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత అధికారిక నివాసమైన పోయస్ గార్డెన్‌లోని వేద నిలయం సీఎం ఆఫీసుగా మారనుంది. ఎందుకంటే, జయలలితకు చెందిన సుమారు రూ.900 కోట్ల ఆస్తులకు వారసులుగా ఆమె మేనల్లుడు దీపక్, మేనకోడులు దీపాలను మద్రాస్ హైకోర్టు ప్రకటించింది. అదేసమయంలో పోయస్ గార్డెన్‌లో ఉన్న జయలలిత ఇంటిని కూడా సీఎం ఆఫీసు, మరికొంత భాగాన్ని జయలలిత స్మారక హౌస్‌గా మార్చాలని హైకోర్టు సూచన చేసింది. ముఖ్యంగా, ఆ ఇంటిలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నందున సీఎం క్యాంపు ఆఫీసుగా మార్చాలని సూచన చేసింది. 
 
అమ్మ ఆస్తులకు వారసులు వీరే... 
అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు కోటాను కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జయలలిత పేరుమీద రూ.913 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులకు వారసులు ఎవరన్న అంశంపై పెద్ద చర్చే జరిగింది. ఒకవైపు జయలలిత అన్న పిల్లలు, మరోవైపు జయలలిత ప్రియ నెచ్చెలి శశికళలు వారసలు తామంటే తాము అంటూ పోటీపడ్డారు. కానీ, మద్రాస్ హైకోర్టు మాత్రం కీలక తీర్పును వెలువరించింది. 
 
జయ ఆస్తుల విషయంలో ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌లను చట్టబద్ధమైన వారసులుగా ప్రకటించింది. చనిపోయేంత వరకు జయ పెళ్లి చేసుకోలేదని... అందువల్ల ఆమెకు దీప, దీపక్ తప్ప మరెవరూ చట్టబద్ధమైన వారసులు లేరని కోర్టు వ్యాఖ్యానించింది. జయలలితకు చెందిన మొత్తం ఆస్తులు వీరిద్దరికే చెందుతాయని చెప్పింది. 
 
మరోవైపు, జయలలిత అధికారిక నివాసమైన పోయస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని జయ స్మారక హౌస్‌గా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, ఇందుకోసం ఓ ఆర్డినెన్స్‌ను కూడా జారీచేసింది. అయితే, జయలలిత ఆస్తులకు ఎవరు వారసులు అనే అంశంపై అన్నాడీఎంకే నేత పుహళేంది దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 
 
తమ సూచనలపై సమాధానం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 8 వారాల గడువు ఇచ్చింది. వేద నిలయం విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని... అందువల్ల జయ వారసులకు కూడా దీని విషయంలో నోటీసులు ఇవ్వాలని, వారి వాదనలను కూడా వినాలని చెప్పింది.