శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (17:34 IST)

పుల్వామా జిల్లాలో సైనికుడిని హతమార్చిన దుండగుడు..

పుల్వామా ఉగ్రదాడి జరిగి ఇంకా నెలరోజులు కూడా పూర్తికాలేదు. ఈలోపే మరో ఘటన కలకలం రేపింది. పుల్వామా జిల్లాలో 25ఏళ్ల సైనికుడిని గన్‌తో షూట్ చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పింగ్లీనా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆషిక్ హుస్సేన్ అనే సైనికుడు జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. 
 
కాగా గుర్తుతెలియని వ్యక్తి మాస్క్‌తో వచ్చి అతడిని షూట్ చేసాడు. పింగ్లీనా గ్రామంలోని నాయక్ మొహల్లా సైనికుడి ఇంటి ముందే ఈ ఘటన జరగడంతో సైనికుల ఇంటికి కూడా భద్రత కరువైందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన కొద్ది క్షణాల్లోనే ఆర్మీ ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకున్నాయి. హంతకుడి కోసం సోదాలు జరిపారు. ఆ ప్రాంతం మొత్తం ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసారు.
 
ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి అనంతరం కాశ్మీర్‌లో ఉన్న ప్రజలు మొత్తం భయాందోళనలో కాలం వెల్లదీస్తున్నారు. జవాన్లు ప్రయాణించడానికి కూడా భద్రత లేకుండా పరిస్థితి తయారయ్యిందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.