మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (09:31 IST)

కార్తీక మంగళవారం.. కుంకుమ నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులతో..?

కార్తీకమాసంలో దీపారాధన చేయడం మహిమాన్వితమైంది. శివాలయంలోగాని, ఇంట్లోనైనా సరే ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేయడం దైవానుగ్రహం పొందవచ్చు. ఎవరైనా సరే, తెలిసిగాని, తెలియకగాని, ఎక్కడైనా సరే కార్తీకమాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరింపవేస్తుంది.

జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభఫలితాలు కలుగుతాయి. కార్తీకదీప దానంవల్ల నరకప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసములో దీపారాధన స్త్రీలకు విశేష ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
దీపం దానమిచ్చుట, బంగారము, నవధాన్యములు గాని, అన్నదానముగాని, శయ్య (మంచం) దానమిచ్చుట వలన స్త్రీలకు ఐదోతనము వృద్ధియగుటేగాక, మంగళప్రదము సౌభాగ్యం సిద్ధిస్తుంది.

సూర్యాస్తమయం అయిన వెంటనే సంధ్యాదీపం వెలిగించుట ముగ్గుపెట్టి ఇంటిముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపము పెట్టుట, తులసి పూజ, గౌరీపూజ చేయుట వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయి.
 
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించాలి. ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ, జిల్లేడు పువ్వులతోనూ పూజించవలెను. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.

అలాగే కార్తీక మాసంలో ధాత్రి పూజ చేయడం మరవకూడదు. ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది.కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది.ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీ దేవిని,విష్ణువును పూజించి ఫలాలను నివేదించాలి.
 
ఇక కార్తీక మాసం..
ఆదివారం - పారాణిలో తడిపి ఆరబెట్టిన వత్తులు
సోమవారం - అరటి దూటతో నేసిన వత్తులు 
మంగళవారం - కుంకుమ నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు
బుధవారం - పసుపు, గంధం, పన్నీరు కలిపిన నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు
 
గురువారం - కొబ్బరి నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు
శుక్రవారం - పసుపు నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు
శనివారం - నువ్వుల నూనెలో నానబెట్టిన తామర తూడుతో నేసిన వత్తులతో దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.