శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 31 మే 2016 (11:41 IST)

తితిదే ఆలయాల్లో పచ్చదనం పెంచాలి : తితిదే ఈఓ సాంబశివరావు

తితిదే పరిధిలోని శ్రీనివాసమంగాపురంలోగల శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఆహ్లాదాన్ని పంచేందుకు వీలుగా మొక్కల పెంపకం చేపట్టి తద్వారా పచ్చదనం పెంచాలని తితిదే కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో సీనియర్‌ అధికారులతో ఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
తిరుమల ఘాట్‌రోడ్డులో ఇరువైపులా భక్తులను ఆకట్టుకునే రీతిలో రంగురంగుల పూల మొక్కలను పెంచాలని సూచించారు. తిరుపతి నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలిపిరి మార్గంలో రోడ్డుకు ఇరువైపులా వ్యర్థాలు పడవేయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తితిదే స్థానిక ఆలయాల్లో ప్రసాదాల దిట్టానికి సంబంధించి నిర్ధిష్ట ప్రమాణాలను పాటించాలని కోరారు. 
 
ఈనెల 22నుంచి 29వ తేదీ వరకు జరిగిన శుభప్రదం కార్యక్రమంపై సమీక్ష కూడా నిర్వహించారు ఈఓ. వచ్చే యేడాదికి పాఠ్యాంశాలపై మరిన్ని మార్పులు చేయాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎస్వీబీసీ ఛానల్‌‌ను చూపించేలా మరింత ఆకర్షణీయంగా శుభప్రదం కార్యక్రమాలను రూపొందించాలన్నారు.
 
తితిదే కళ్యాణ మండపాలను క్రమం తప్పకుండా పరిశీలించి ఏవైనా మరమ్మత్తులు ఉంటే పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అనంతవరంలోని శ్రీవారి ఆలయం, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో ఇంజనీరింగ్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం సముదాయాల్లో భక్తుల సౌకర్యార్థం అవసరమైనన్ని ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీనివాసంలో ఉన్న వసతులను భక్తులు సులువుగా గుర్తించేందుకు వీలుగా ప్రదర్సనా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. 
 
శ్రీనివాసమంగాపురంలో కాలినడక భక్తుల సౌకర్యార్థం లగేజీ కౌంటర్‌ సక్రమంగా పనిచేసేలా చూడాలని ఈఓ సూచించారు. తితిదే సంస్థల్లో విద్యుత్‌ మరమ్మత్తు పనులకు సంబంధించి ఎపిఎస్పీడిసీఎల్‌ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన డివిజనల్‌ ఇంజనీర్లు అందించిన నివేదికపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.