శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (11:29 IST)

మూఢభక్తి.. ఆరేళ్ల బిడ్డను దేవుడి పటాల ముందు బలిచ్చింది.. ఎక్కడ?

ఆధునిక యుగం నడుస్తున్నా.. స్మార్ట్ ఫోన్లు వచ్చేసినా మూఢ నమ్మకాలు మాత్రం మరుగునపడట్లేదు. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఓ మహిళ మూఢభక్తితో తన ఆరేళ్ల బిడ్డను దేవుడి పటాల ముందు బలిచ్చింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లాలోని మోతె మండలం మేకలపాటి తండాకు చెందిన బానోత్ భారతి బీఎస్సీ, బీఈడీ చదువుకుంది. ఉద్యోగాలకు కూడా సన్నద్ధమైంది. 
 
ఎనిమిదేళ్ల క్రితం మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే మనస్పర్థల కారణంగా దంపతులు కొన్ని రోజులకే విడిపోయారు. అనంతరం పుట్టింటికి చేరుకున్న భారతి రెండేళ్ల క్రితం తండాకే చెందిన కృష్ణ అనే యువకుడిని ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యకు యత్నించింది. దీంతో పెద్దలు వారి పెళ్లి చేయకతప్పలేదు. ఆరు నెలల క్రితం వీరికి కుమార్తె పుట్టింది.
 
కట్ చేస్తే.. భారతి నిత్యం యూట్యూబ్‌లో ఆధ్యాత్మిక వీడియోలు చూస్తూ గడిపేది. తనను తాను శివుడిగా భావించేది. ఇటీవల గ్రామానికి ఓ సాధువు రాగా, ఆమెకు నాగదోషం ఉన్నట్టు చెప్పాడు. అప్పటి నుంచి భారతి మానసిక పరిస్థితి మరింత దిగజారింది.
 
నిత్యం పూజలతోనే గడిపేది. భర్త నిన్న పనిమీద సూర్యాపేటకు వెళ్లగా, అత్తమామలు పొలం పనులకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన భారతి కుమార్తె రీతును దేవుడి పటాల ముందు పడుకోబెట్టి కత్తితో గొంతుకోసి హతమార్చింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.