రాజకీయాలు స్వార్థంతో కలుషితమయ్యాయి.. ఓట్ల కోసమే గాంధీ పేరు: కమల్ హాసన్
రాజకీయాలపై సినీ లెజెండ్ కమల్ హాసన్ అసంతృప్తిని వెళ్లగక్కారు. చెన్నై వరదల సమయంలో ప్రజలు పడుతున్న బాధను వ్యక్తం చేసి.. వార్తల్లో నిలిచిన కమల్ హాసన్.. తాజాగా రాజకీయాలపై తన అభిప్రాయాన్ని తెలిపారు. భారత్కు స్వతంత్ర్య సమయంలో ఉన్న రాజకీయ పటిమ ప్రస్తుతం కనుమరుగైందని తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ లాంటి ఉన్నత నాయకుడిని ఆ రోజుల్లో ప్రజలు ఎన్నుకుని దేశానికి స్వతంత్ర్యం సాధించగలిగారన్నారు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో స్వార్థం చోటుచేసుకుందని.. తద్వారా రాజకీయాలు కలుషితమయ్యాయన్నారు.
గాంధీ జీవితచరిత్ర “మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్” పుస్తకాన్ని సరళ తమిళ భాషలో పొదిగై టివి ఛానెల్ కోయంబత్తూరు జిల్లా సంచాలకులు ఆండాళ్ ప్రియదర్శిని రచించారు. ఈ పుస్తకావిష్కరణ ఆవిష్కరించిన సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. గాంధీజీ పేరుతో రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య పెరిగిందని విమర్శించారు. గాంధీని రాజకీయంగా చూడకూడదని హితవు పలికారు. నేడు ఓట్ల కోసం, పదవుల కోసం గాంధీ పేరును రాజకీయ నేతలు ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా పుస్తకాన్ని తమిళంలో అనువదించడం ద్వారా ఆండాళ్ ప్రియదర్శిని దేశసేవ చేశారని కొనియాడారు.