1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (09:03 IST)

చెక్ బౌన్స్ కేసులో "ది వారియర్" చిత్ర దర్శకుడు లింగుస్వామికి జైలుశిక్ష

nlinguswamy
చెక్ బౌన్స్ కేసులో "ది వారియర్" చిత్ర దర్శకుడు ఎన్.లింగుస్వామికి సైదాపేట మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలుశిక్షను విధిస్తూ సోమవారం సంచలన తీర్పునిచ్చింది. "ఎన్ని ఏళు నాల్" అనే చిత్రాన్ని లింగుస్వామి తమ సొంత నిర్మాణ సంస్థ తిరుపతి బ్రదర్స్ బ్యానరులో గత 2014లో నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణం కోసం పీవీవీ క్యాపిటల్స్ అనే సంస్థ నుంచి రూ.కోటి 3 లక్షల రూపాయలను రుణంగా తీసుకున్నారు. 
 
ఈ మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీసుకున్న రుణాన్ని తక్షణం చెల్లించాలని ఆదేశించింది. దీంతో రూ.1.3 కోట్లకు లింగుస్వామి చెక్కును ఇచ్చారు. బ్యాంకులో తగినంత సొమ్ము నిల్వ లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. దీనిపై పీవీపీ వెంచర్స్ కంపెనీ సైదాపేట కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సైదాపేట కోర్టు లింగుస్వామికి ఆరు నెలల జైలుశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
"ది వారియర్" చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన లింగుస్వామికి మంచి పేరుంది. కోలీవుడ్‌లో మంచి దర్శకుడుగా, సాహితీవేత్తగా గుర్తింపు వుంది. అలాంటి వ్యక్తిని జైలుశిక్ష పడటం ఇపుడు తెలుగు, తమిళ చిత్రపరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఈ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్టు లింగుస్వామి సోమవారం రాత్రి విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.