గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (19:39 IST)

25 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడ సందడి చేసేందుకు సిద్ధమైన చిరు..

మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రానికి సంబంధించిన టీజర్ నిన్ననే విడుదలైంది. చిరంజీవి నటనకు అభిమానులు దాసోహం అంటున్నారు. సోషల్ మీడియాలో ఇదే అంశంపై పోస్ట్‌లు పెడుతూ తెగ సంబరపడిపోతున్నారు. హాలీవుడ్ స్థాయిలో కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన టీజర్ ఆకట్టుకుంది.

60 ఏళ్ల వయస్సులో కూడా చిరంజీవి ఆ స్థాయిలో నటించి మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. కష్టమైన సన్నివేశాలను తెరకెక్కించేటప్పుడు చిరు ఎలాంటి డూప్‌లు లేకుండా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారట. నిర్మాత రామ్ చరణ్, అలాగే దర్శకుడు సైతం ఈ విషయంలో డూప్ లేకుండా సన్నివేశాలను తీయాలని పట్టుబట్టి, చిత్రం ఆలస్యమైనా ఆ సీన్స్‌ను తనచేత చేయించారని మెగాస్టార్ టీజర్ విడుదల వేడుకలో పేర్కొన్నారు.
 
సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే టాలీవుడ్‌లో మాత్రమే సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. ఆడియో రిలీజు మొదలుకొని సక్సెస్ మీట్ వరకు అన్ని ఫంక్షన్‌లను హైదరాబాద్ లేదా విశాఖలో నిర్వహిస్తుంటారు. అయితే సైరా సినిమా అందుకు భిన్నం. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించడంతో బాలీవుడ్‌లో ప్రమోషన్ చేసేందుకు అక్కడ టీజర్ విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.
 
మెగాస్టార్ చిరు తెలుగులో స్టార్ హీరోగా ఉన్న సమయంలో బాలీవుడ్‌లో సైతం అజ్ కా గూండారాజ్, ప్రతిబంద్, జెంటిల్మెన్ వంటి సినిమాలు చేసారు. ఈ సినిమాలు మంచి విజయాలను అందించాయి. అప్పుడు చిరంజీవి వరుసగా హిందీ చిత్రాలు చేస్తారని అందరూ ఊహించారు. కానీ 1994లో వచ్చిన జెంటిల్‌మెన్ సినిమా తరువాత మళ్ళీ బాలీవుడ్ సినిమా చేయలేదు. ఇన్నాళ్లకు అంటే 25 సంవత్సరాల తరువాత మెగాస్టార్ సైరా సినిమాతో తిరిగి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. చిరు బాలీవుడ్ రీఎంట్రీ ఎలా ఉంటుందో తెలియాలంటే అక్టోబర్ 2వ తేదీ వరకు వేచి చూడాల్సిందే మరి..