శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (11:45 IST)

సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. తొలి ట్వీట్ ఇదే...

ఇపుడు ప్రపంచాన్ని డిజిటల్ మీడియా శాసిస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటివి శాసిస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ ఈ సోషల్ మీడియాల్లో ఏదో ఒకదానిలో ఖాతావుంటుంది. కానీ, తెలుగు సినీ ప్రపంచంలో మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవికి మాత్రం ఒక్క ఖాతాకూడా లేదు. ఇపుడు ఆయన ఈ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు కొత్త సంవత్సరాది అయిన ఉగాది (శ్రీశార్వరినామసంవత్సరం) రోజున ఆయన తన సోషల్ మీడియా ఖాతాను ప్రారంభించారు. ట్విట్టర్‌లో తన తొలి పోస్ట్‌ చేశారు.
 
"అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం" అని తన ట్వీట్‌లో చిరంజీవి పిలుపునిచ్చారు. 
 
మరో ట్వీట్‌గా 21 రోజులు మనందరినీ ఇళ్ళల్లోనే ఉండమని మన భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఓ అనివార్యమైన చర్య. ఈ క్లిష్టమైన సమయంలో మనం, మన కుటుంబాలు, మనదేశం సురక్షితంగా ఉండటానికి మన ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ ఇచ్చే ఆదేశాలని పాటిద్ధాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం అని పేర్కొన్నారు. 
 
కాగా, ఆయన తన ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 18 వేల మంది ఫాలోయర్లు వచ్చిచేరారు. పైగా, ఇక అభిమానులు మెగాస్టార్ ట్విట్టర్ ఐడీని @KChiruTweets అనుసరించవచ్చు. ప్రొఫైల్ పిక్‌గా ఖైదీ నెం.150లోని స్టిల్‌ని జ‌త చేశారు.