శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 నవంబరు 2022 (15:01 IST)

చిరంజీవి విలక్షణమైన నటుడు : ప్రధాని నరేంద్ర మోడీ

megastar
మెగాస్టార్ చిరంజీవిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి ఓ విలక్షణమైన నటుడు అంటూ కొనియాడారు. విశిష్ట నటనా చాతుర్యంతో భిన్న రకాల పాత్రలను పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. తన అద్భుతమైన వ్యక్తిత్వంతో ఆకట్టుకున్నారని చెప్పారు. 
 
కాగా, మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు వరించిన విషయం తెల్సిందే. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు కోసం ఆయనను ఎంపిక చేశారు. సోమవారం నుంచి గోవా వేదికగా జరిగే ఇఫీ (ఐఎఫ్ఎఫ్ఐ) చలనచిత్రోత్సవ వేడుకల్లో ఈ అవార్డును చిరంజీవికి ప్రదానం చేస్తారు. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేయడంపై చిరంజీవి స్పందించారు. 
 
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ చేసిన ప్రకటన తనకెంతో సంతోషం కలిగించిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చిరంజీవి అన్నారు. 
 
అంతకుముందు చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022గా ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ అధికారికంగా ఓ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి విశేష ప్రజాదారణ పొందారని, హృదయాలను కలిగించే నటనా ప్రతిభ ఆయన సొంతమని కొనియాడుతూ, మెగాస్టార్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
 
ఇపుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం చిరంజీవికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీ అభినందనలను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రశంసాపూర్వకమైన మీ మాటలు సంతోషదాయకం అని చిరంజీవి రిప్లై ఇచ్చారు.