శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (16:21 IST)

సమన్లు అందలేదు .. రకుల్ :: సమన్లు పంపించింది వాస్తవం .. ఎన్సీబీ

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధం ఉన్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో - ఎన్సీబీ పక్కా ఆధారాలను సేకరించింది. దీంతో గురువారం విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. 
 
ఇంతవరకు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని రకుల్‌ చెప్పుకొచ్చింది. తనకు హైదరాబాద్‌, ముంబైలో ఎక్కడా ఎన్సీబీ నుంచి సమన్లు అందలేదని తన‌ మేనేజర్ ద్వారా‌ ఒక ప్రకటన విడుదల చేయించింది. అయితే, షూటింగ్ కోసం హైదరాబాద్‌ వచ్చిన ఆ భామ మళ్లీ హడావుడిగా బుధవారం రాత్రి ముంబైకు చేరుకోవడం గమనార్హం. 
 
మరోవైపు సమన్లు జారీపై ఎన్సీపీ అధికారులు స్పందించారు. తనకు సమన్లు అందలేదంటూ రకుల్ చేసిన వ్యాఖ్యలను ఎన్సీబీ సీనియర్ అధికారి కేపీఎస్ మల్హోత్రా కొట్టిపారేశారు. రకుల్‌కు సమన్లు జారీ చేశామని, ఆమె ఫోనులో అందుబాటులోకి లేకపోవడంతో వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమెను సంప్రదించామని చెప్పారు. 
 
అయితే, ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు. ఆమె గురువారం కూడా విచారణకు హాజరు కాలేదని స్పష్టంచేశారు. కాగా, డ్రగ్స్‌ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనె వంటి సెలబ్రిటీలను కూడా అధికారులు విచారించనున్న విషయం తెలిసిందే. వీరందరికీ సమన్లు జారీచేయడం జరిగింది.