1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (10:54 IST)

టీడీపీ గెలుపును తమ గెలుపుగా సెలెబ్రేట్ చేసుకుంటున్న టాలీవుడ్!!

tollywood industry
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం జ‌న‌సేన‌ బీజేపీ కూట‌మి భారీ విజయంతో అధికారం ఛేజిక్కించుకున్న తరుణంలో అన్నీ వర్గాల ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.‌ ఈ జాబితాలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఉంది. నాలుగోసారి, సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్ర‌బాబు నాయుడుకు సినీ పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. మరోపక్క పవన్ కల్యాణ్ ఈ ఎన్నికలలో గేమ్ ఛేంజర్‌గా నిలవటం టాలీవుడ్‌లో మరింత ఎక్కువ ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. 
 
ఎన్నికలకు ముందు నుంచే తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..‌ కూటమి విజయం ఖాయమైన అనంతరం చంద్ర‌బాబు పాల‌నా ద‌క్ష‌తపై నమ్మకంతో ఉన్నామంటూ.. శుభాభినందనలు తెలిపారు‌. రాజకీయ దురంధరులైన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నట్లు చిరంజీవి ఆకాంక్షించారు. 
 
ప్రత్యేకంగా త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచలన విజయంపై కూడా చిరంజీవి ఓ అన్నగా గర్వపడుతున్నట్లు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా పలువురు నటీనటులు, నిర్మాతలు చంద్రబాబు నాయుడుతో పాటు చిత్ర పరిశ్రమ వ్యక్తులుగా ఉన్నటువంటి పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ లకు అభినందనలను తెలిపారు.
 
ఓవిధంగా చిత్ర పరిశ్రమ కూటమి విజయాన్ని తమ విజయంగా సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి ఈసారి ఎక్కువగా కనిపించింది. దానికి కారణం లేకపొలేదు. గత ఐదేళ్ల‌కాలంలో సామాన్యలు ఎంతో వేధించబడ్డారో, సినిమా పరిశ్రమ కూడా అంతే జగన్ ప్రభుత్వం వలన ఒడిదుడుకలకుగురైంది. టికెట్ రేట్లు మొదలు, సినిమా హీరోల రెమ్యూనిరేషన్‌లపై అనవసరపు కామెంట్స్.. స్టార్ హీరోలను జగన్ తన‌ క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించుకుని అవమానకరమైన ట్రీట్మెంట్ ఇవ్వటం‌. ‌ఇలా పైకి కనిపించేలా, కనిపించని రీతిలో అనేక విధాలుగా సినీ పరిశ్రమకు సంబందించిన వ్యక్తులను, వ్యవస్థలను వైసిపి ప్రభుత్వం చిన్న చూపు చూసింది .
 
ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తిగా, చంద్రబాబు నాయుడుకు తోడుగా నిలబడి, తెలుగు రాజకీయాలలో మునుపెన్నడు లేనటువంటి విజయం సాధించటంలో, కీలకపాత్ర పోషించారు. ‌అందుకేనెమో ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అందుకున్న విజయాన్ని ఇండస్ట్రీ తన విజయంగా ఓన్ చేసుకున్న సిట్యువేషన్ కనిపిస్తుంది. ఇక కూటమి విజ‌యం సాధించిన తర్వాతనే, తమ సినిమాలను రిలీజ్ చేయాలనే సంకల్పంతో పలువురు నిర్మాతలు వెయిట్ చేశారు. ‌గత ఐదేళ్లుగా ఏపీతో చిత్ర పరిశ్రమకు రిలేషన్ తగ్గుతూ వచ్చిన తరుణంలో, టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావటంతో అన్నీ వ్యవస్దలతో‌పాటు, ఏపీలో చిత్ర పరిశ్రమ కూడా గ్రౌండ్ లెవెల్‌లో గాడిన పడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.