శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (13:42 IST)

ప్రతి ఒక్కరినీ కన్నీరు తెప్పించిన యాత్ర అసిస్టెంట్ డైరెక్టర్ స్పీచ్...

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. మహి వి రాఘవ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కగా, వైఎస్ఆర్‌గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. జగపతి బాబు అత్యంత కీలకమైన పాత్రను పోషించారు. ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ చిత్రానికి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. అతని ప్రసంగం యధావిధిగా.... 
 
'2008లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా అమ్మకి గుండె నొప్పి వస్తే హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకొచ్చాం. గుండెలో హోల్ ఉంది. 6 నెలల కంటే ఎక్కువ బతకదని చెప్పారు. అంత స్థోమత లేదని తిరిగి మా ఊరు బస్సులో వెళ్తుంటే.. ఏ తల్లీ కొడుకుని కోరని ఒక కోరిక మా అమ్మ నన్ను అడిగింది. 'మూడు లక్షలు అప్పు తెచ్చి నాకు ఆపరేషన్ చేయించు. నాకొక ఐదారేళ్లు బతకాలని ఉంది. మీరు చిన్న పిల్లలు' అంది. 
 
అప్పుడు నా చదువు పోతే పోయింది మా అమ్మకంటే ఎక్కువ కాదు అని.. డిగ్రీ వదిలేసి హైదరాబాద్ వచ్చాను. జూబ్లీహిల్స్‌లోని ఓ కాఫీ షాప్‌లో పని చేస్తూ ఎంగిలి ప్లేట్లు, కప్పులు కడిగాను. అయినా నాలుగు నెలల్లో నాకు వచ్చింది రూ.20 వేలు మాత్రమే. ఆ డబ్బు మా అమ్మ హాస్పిటల్ ఖర్చులకు, బస్ చార్జీలకు సరిపోయింది. అప్పుడు మా అమ్మ.. 'నా ప్రాణం పోతే.. చెల్లిని బాగా చూసుకో.. చెల్లి చిన్నది. నేను చనిపోయినా మీరు ధైర్యంగా ఉండాలి' అని చెప్పింది. 
 
గుడి, చర్చి, మసీదు ఏది కనిపించినా మా అమ్మ 'ఐదారేళ్లు బతికితే చాలు. నా పిల్లలు చిన్నవాళ్లు' అని మొక్కుకునేది. కానీ ఏ దేవుడూ మా మొర ఆలకించలేదు. కానీ 2009లో వైఎస్సార్ అనే దేవుడు నేనున్నాను.. అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. ఎల్‌బీ నగర్ కామినేని హాస్పిటల్‌లో ఒక్క రూపాయి తీసుకోకుండా ఆపరేషన్ చేశారు.
 
మేము చాలా పేదవాళ్లం. చిన్న రెండు గదుల ఇల్లుంది. అది కూడా రాజశేఖర్ రెడ్డిగారిచ్చిన ఇందిరమ్మ ఇల్లే. మా ఇంట్లో ఏ దేవుడి ఫోటోలుండవు. వైఎస్సార్ ఫోటోలు మూడు కనిపిస్తాయి. ప్రతిరోజు మా అమ్మ నాకు ఫోన్ చేస్తది. పదేళ్లకు ముందు ఆగిపోవాల్సిన మాట ఇప్పటికీ నాకు వినబడుతుందంటే దానికి కారణం వైఎస్సార్. ఈ మాట చెప్పటానికి మా అమ్మను ఇక్కడికి తీసుకొద్దామనుకున్నా.

కానీ నేను సినిమాల్లో చేస్తున్నట్టు ఆమెకు తెలియదు. కానీ ఫిబ్రవరి 8న (యాత్ర రిలీజ్) మా స్వగ్రామం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి వెళ్లి.. మా అమ్మను, చెల్లిని సినిమాకు తీసుకెళ్లి గర్వంగా పెద్దాయన సినిమాకు పనిచేశానని చెప్పుకుంటా. నాకు తెలిసి ఇంతటి అదృష్టం రాదు. దేవుడు లాంటి మనిషి(వైఎష్సార్) చనిపోయాడు. అలాంటి దేవుడి రుణం ఈ సినిమాకు పని చేయడం ద్వారా కొంచెమైనా రుణం తీర్చుకున్నా' అని చెప్పుకొచ్చారు.