శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (15:26 IST)

విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ సంభాషణ... నెట్టింట వైరల్ అయిన ఇస్రో కార్టూన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2 మరికొన్ని గంటల్లో చందమామపై కాలుమోపనుంది. ఈ మిషన్‌లో అమర్చిన విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ మరికొన్ని గంటల్లో విడిపోనుంది. ఇది చాలా కీలక దశ. శనివారం తెల్లవారుజామున 4 గంటల తర్వాత, సుమారు 5.30 గంటల నుంచి 6.30 గంటల మధ్య అందులోంచి ప్రజ్ఞాన్ రోవర్ వెలుపలి వచ్చి 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. అనంతరం తాను సేకరించిన సమాచారాన్ని విక్రమ్‌కు చేరవేస్తుంది. విక్రమ్ ద్వారా ఈ సమాచారం బెంగళూరు సమీపంలోని బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్‌కు అందుతుంది.
 
చంద్రుడి మీదికి విక్రమ్ ల్యాండ్ కావడానికి సుమారు 15 నిమిషాలు సమయం పడుతుంది. ఇది అత్యంత కీలకమైన సంక్లిష్ట ప్రక్రియ. అందుకు ఈ సమయాన్ని '15 మినిట్స్ ఆఫ్ టెర్రర్'గా ఇస్రో అభివర్ణించింది. మన శాస్త్రజ్ఞుల కృషి ఫలించి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే విక్రమ్ విసురుగా వెళ్లి చంద్రుడిపై కూలిపోకుండా మృదువుగా ల్యాండ్ అవుతుంది. 
 
ఇలాంటి కీలక, సంక్షిష్ట దశలో భాగంగా విడిపోయే ముందు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఒకరితో మరొకరు సంభాషించుకుంటే ఎలా ఉంటుంది? ఈ సరదా ఆలోచనకు అద్దంపడుతూ ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో ఓ చక్కటి కార్టూన్ రూపంలో పోస్ట్ చేయగా, ఇది ఇపుడు నెట్టింట వైరల్ అయింది. 
 
ప్రజ్ఞాన్: ఇంతవరకూ నీతో ప్రయాణించడం చాలా గొప్పగా ఉంది విక్రమ్.
 
విక్రమ్: నిజమే ఇదెంతో అహ్లాదకరమైన ప్రయాణం. కక్షలో తిరిగేటప్పుడు నిన్ను నేను చూస్తుంటానుగా.
 
ప్రజ్ఞాన్: బెస్ట్ ఆఫ్ లక్ విక్రమ్. త్వరలోనే నువ్వు సౌత్ పోల్‌కు (దక్షిణ ధ్రువానికి) చేరుకుంటావని ఆశిస్తున్నాను.
 
విక్రమ్, ప్రజ్ఞాన్ మధ్య ఇలా సరదా సంభాషణతో ఇస్రో పోస్ట్ చేసిన ఈ కార్టూన్ ఇప్పుడు నెట్‌లో చక్కర్లు కొడుతూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.