శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (16:23 IST)

ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం భారమే : టీడీపీ నేత జేసీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పగ్గాలు చేపట్టి వందరోజులు పూర్తి చేసుకుంది. దీన్ని వైకాపా శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. అయితే, టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 
 
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ మోహన్ రెడ్డిని చేయిపట్టుకుని నడిపించేవాడు కావాలన్నారు. అలాగే, ప్రతి అంశాన్ని మైక్రోస్కోపులో చూపి లోపాలను సరిద్దాలని కోరారు. అంతేగానీ, దాన్ని నేలకేసి కొట్టొద్దని ఆయన పిలుపునిచ్చారు. 
 
పైగా, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేదు కానీ, ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమే అవుతుందన్నారు. అంతటితో ఆగని ఆయన..'మా వాడు చాలా తెలివైనవాడు..' అంటూ వైఎస్ జగన్‌కు జేసీ కితాబిచ్చారు. రాజధాని అమరావతిలోనే ఇక్కడే ఉంటుందని.. ఎక్కడికీ తరలిపోదని మాజీ ఎంపీ జేసీ చెప్పుకొచ్చారు. 
 
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన వైకాపా వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో జేసీ దివాకర్ పోటీ చేయకుండా ఆయన కుమారుడిని అనంతపురం ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలోకి దించారు. కానీ, ఆయన ఫ్యాను గాలికి చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో జగన్ చెంతకు చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.