ఇరాన్ దేశస్థుడనుకుని కాల్చి పారేశా : తెలుగు టెక్కీ హత్య కేసు నిందితుడు
ఇరాన్ దేశస్థుడనుకుని తెలుగు ఇంజనీర్ను కాల్చినట్టు శ్రీనివాస్ కూచిభొట్లా హత్య కేసులో అమెరికా పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ వెల్లడించాడు. ఈ మేరకు ఆయన మంగళవారం కోర్టుకు వాంగ్మూలం ఇచ్చ
ఇరాన్ దేశస్థుడనుకుని తెలుగు ఇంజనీర్ను కాల్చినట్టు శ్రీనివాస్ కూచిభొట్లా హత్య కేసులో అమెరికా పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ వెల్లడించాడు. ఈ మేరకు ఆయన మంగళవారం కోర్టుకు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఆయనపై ఫస్ట్ డిగ్రీ హత్య, ఫస్ట్ డిగ్రీ హత్యాయత్నం అభియోగాలను మోపారు.
అమెరికాలో గల కన్సాస్లోని ఓ పబ్లో జాత్యహంకార దాడికి పాల్పడిన 51 ఏళ్ల నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ప్యూరింటన్ జరిపిన కాల్పుల్లో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించగా, మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే. అమెరికా నావికాదళ మాజీ అధికారి అయిన ప్యూరింటన్ను తొలిసారిగా పోలీసులు సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని కోర్టులో హాజరు పరిచారు. విచారణలో భాగంగా అడిగిన ప్రశ్నలన్నింటికీ ఏ మాత్రం తొణకకుండా ప్యూరింటన్ సమాధానమివ్వడం గమనార్హం.
కాగా, శ్రీనివాస్ను హత్య చేసిన తర్వాత నిందితుడు ప్యూరింటన్ 70 మైళ్ల దూరం పారిపోయాడు. ఆపిల్ బే రెస్టారెంట్కు వెళ్లి అటెండర్కు హత్య విషయం చెప్పాడు. వారితో పాటు ఉంటానని ప్యూరింటన్ అడిగాడని, దానికి అంగీకరిస్తే ఏం జరిగిందో చెప్తానని అన్నాడని బార్ అటెండర్ తెలిపాడు. తాము సరేనని చెప్పడంతో జరిగిందంతా చెప్పాడని అతను తెలిపారు. ఆ వెంటనే తాను వెంటనే 911కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో ప్యూరింటన్ను అరెస్టు చేసినట్లు అతను తెలిపాడు.
జాన్సన్ కౌంటీ జైలులో ప్రస్తుతం ప్యూరింటన్ను ఉంచారు. కాగా, ఈ కేసులో సాక్ష్యాధారాలను సేకరణకు ఎఫ్బీఐ సహకరిస్తోంది. తిరిగి ఈ నెల 9వ తేదీన అతను కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. కాగా, ప్యూరింటన్ జాత్యహంకార నేరానికి పాల్పడినట్టు డిస్ట్రిక్ట్ కోర్టులో రుజువైతే ఆయనకు 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.