1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Updated : గురువారం, 23 మే 2019 (16:47 IST)

రాహుల్‌కు ప్రియాంకా ఓదార్పు... పడుతూలేస్తూ సాగుతున్న పవన్ కళ్యాణ్

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఊహించిన రీతిలో ప్రజాతీర్పు వెలువడటం పట్ల పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారు. దీంతో ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ వెస్ట్ విభాగం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఢిల్లీలోని తన సోదరుడు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. రాహుల్‌ను కలిసి ఫలితాలపై ఓదార్చారు. 
 
ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన స్థానాలు గెలుచుకునేందుకు వీలుగా ప్రియాంకా గాంధీని స్టార్ క్యాంపెయినర్‌గా రంగంలోకి దించిన విషయం తెల్సిందే. అయితే, తన స్థాయికి తగినట్టుగానే ప్రియాంక భారీ జనసమూహాలను రోడ్ షోలకు, సభలకు రప్పించగలిగింది. కానీ, ఓట్లు సాధించిపెట్టే విషయంలో ఆమె కూడా విఫలమైంది. ఇదంతా మోడీ ప్రభంజనం కారణంగానే అని వేరే చెప్పనక్కర్లేదు. 
 
మరోవైపు, కోటి ఆశలతో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రయాణం పడుతూలేస్తూ కొనసాగుతోంది. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో వెనుకబడివున్నారు. ముఖ్యంగా, వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం, వైజాగ్‌లోని గాజువాక స్థానాల్లో పవన్ వెనుకబడివున్నారు. 
 
కౌంటింగ్ మొదలైన క్షణం నుంచి చివరిస్థానంలో ఉన్న జనసేన ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. కనీసం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గెలుపుపైనా ఎవరూ నమ్మకం వ్యక్తం చేయలేకపోతున్నారు. గాజువాకలో పవన్ పూర్తిగా సైడైపోగా, భీమవరంలో మాత్రం కాసేపు వెనుకబడినా, కాసేపు ఆధిక్యంలోకి వస్తున్నారు. 9వ రౌండ్ సమయానికి పవన్ 200 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో నిలిచారు. అయితే ఈ ఆధిక్యం ఎంతసేపు నిలుస్తుందన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.