ఏపీలో 'వంగవీటి'కి ఒప్పుకోలేదు... తెలంగాణలో కుదిరింది...: నిర్మాత కిరణ్ కుమార్
నిర్మాతగా 'వంగవీటి' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా సమస్యలను ఎదుర్కొన్నానని దాసరి కిరణ్కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫిలించాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయడానికి అంగీకరించలేదు. అందుకు కారణాలను కూడా వారు వివరించలేదు. అయితే తెలంగ
నిర్మాతగా 'వంగవీటి' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా సమస్యలను ఎదుర్కొన్నానని దాసరి కిరణ్కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫిలించాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయడానికి అంగీకరించలేదు. అందుకు కారణాలను కూడా వారు వివరించలేదు. అయితే తెలంగాణ ఫిలిం ఛాంబర్ పూర్తి సహకారం అందించారు. సినిమా విడుదల వరకు చాలామంది కోర్టులో కేసులు కూడా వేశారు. ఆడియో వేడుక చేయడానికి గ్రౌండ్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఎవరికీ తెలియవు.
కోర్టులే చెప్పలేదని..
వంగవీటి రాధా, రంగా, దేవినేని కుటుంబాలు ప్రజలకు ఎంతో సేవ చేశారు. అయితే వారిలో వచ్చిన మనస్పర్ధల కారణంగానే హత్యలు జరిగాయి. 1973లో చలసాని వెంకటరత్నం హత్యతో మొదలైన ఈ హత్యలు 1988 రంగాగారి హత్య వరకు కొనసాగింది. తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా అసలు రంగా హత్య గురించి స్టెప్ తీసుకోలేదు. 18 ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టు కేసును కొట్టేసింది. ప్రభుత్వాలు, కోర్టులే చెప్పలేని వాస్తవాలను సిస్టమ్కు వ్యతిరేకంగా చెప్పడానికి మేమెవరం. అందుకే రంగాగారి హత్యతోనే సినిమాను ముగించాం.
విషయాలు తెలియవు
28 ఏళ్ల క్రితం వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య జరిగిన గొడవలను ప్రస్తావిస్తారు కానీ అసలు ఏం జరిగిందనే విషయాలు ఎవరికీ తెలియవు. అసలేం జరిగిందనే దాని గురించి చెప్పే ప్రయత్నం చేశామే తప్ప, ఎవరినీ తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నం చేయలేదు. అయితే సినిమాలో రాధా క్యారెక్టర్ను ఎలివేట్ చేసినట్టు రంగా క్యారెక్టర్ను సీన్స్ రూపంలో చెప్పలేకపోయాం. సినిమా చూసిన రంగాగారి అభిమానులు రంగాగారి క్యారెక్టర్ను ఇంకాస్త బాగా చూపించి వుంటే బావుండేది కదా అన్నారు. ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్ను మేం రెండు గంటల పదిహేను నిమిషాల్లో చెప్పాలనుకున్నప్పుడు అందులో భాగంగానే ఓ ఐడియా ప్రకారం సినిమా చేసుకుంటూ వచ్చాం. సినిమాలో రంగాగారి క్యారెక్టర్ను ఇంకాస్త బాగా చూపించాల్సిందని చాలామంది అన్నారు. ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తాను. డిసెంబర్ 23న 270 థియేటర్స్లో విడుదల చేశాం. సినిమా ఇప్పటికీ సక్సెస్ఫుల్ 140 థియేటర్స్లో రన్ అవుతుంది.
తదుపరి చిత్రాలు...
మా రామదూత క్రియేషన్స్ బ్యానర్పై ఓ కమర్షియల్ సినిమాను ప్లాన్ చేస్తున్నాం. ఆ వివరాలను సంక్రాంతి తరువాత తెలియజేస్తాం అని చెప్పారు.