బుధవారం, 12 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మార్చి 2025 (12:41 IST)

మంచు విష్ణు "కన్నప్ప"కి విమర్శల పరంపర - లిరికల్ సాంగ్ రిలీజ్‌తో చెలరేగిన దుమారం!!

kannappa
డాక్టర్ మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తూ రూపొందుతున్న చిత్రం "కన్నప్ప". ఈ చిత్రం ఆది నుంచి విమర్శల్లో చిక్కుకుంటుంది. తాజాగా ఆ చిత్రం నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. కోయ నేపథ్యానికి సంబంధం లేని సాహిత్యంతో ఈ పాటను రూపొందించారు. అలాగే, యాసకు దూరంగా ఈ పాట సాగింది. దీంతో ఈ పాటపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
వచ్చే నెల 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. 'కన్నప్ప' చరిత్రను ఫారిన్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ చిత్రం విమర్శల్లో చిక్కుకుంది. ఒక కోయగూడానికి చెందిన మొరటు వ్యక్తిని యుద్ధ వీరుడిగా చూపించడం, శివుడుకి మీసాలు లేకపోవడం, ప్రభాస్ లుక్ అయోమయంగా అనిపించడం చాలా మందిని తీవ్ర అసంతృప్తికి లోనుచేసింది. 
 
ఈ పరిస్థితుల్లో ఇటీవల రిలీజ్ చేసిన 'శివశివశంకర...' పాటలో 'కన్నప్ప' తనకి అందుబాటులో ఎలాంటి పాత్ర లేకపోవడం వల్ల నోట్లో నీళ్లు పోసుకుని శివలింగాన్ని అభిషేకిస్తాడు. ఆ తర్వాత షాట్‌లోనే మట్టిపాత్రలో దుప్పి మాంసం నైవేద్యం పెట్టినట్టు చూపించడం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేసింది. ఇక తాజాగా 'కన్నప్ప' నుంచి "సగమై.. చెరిసగమై..." అంటూ సాగే మరో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మొదటి పాట మాదిరిగానే ఈ పాట కూడా విమర్శల నుంచి తప్పించుకోలేకపోయింది. 
 
కోయగూడానికి చెందిన భార్యాభర్తలు ఆ యాసలోనే పాటలు పాడుతుంటారు. గతంలో వచ్చిన "భక్త కన్నప్ప"లోని పాటలు ఇప్పటికీ నిలిచిపోవడానికి కారణం ఆ సహజత్వమే. కానీ ఈ పాటలో 'కన్నప్ప' పాత్రకి ''ఇరు పెదవుల శబ్దం - విరి ముద్దుల యుద్ధం'' అనే ప్రయోగం చేశారు. ఇది సాధారణ యువతీ యువకులు పాడుకునే పాట మాదిరిగానే ఉందిగానీ, కోయగూడానికి చెందిన ఆలుమగలు పాడుకునే పాటలా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ పాటలో హీరోయిన్ పెదవులపై హీరో ముద్దు పెట్టేందుకు ప్రయత్నించడం కొసమెరుపు. 
 
కాగా, బాలీవుడ్ దర్శకుడు ముకేష్ కుమార్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నప్పగా మంచు విష్ణు, శివుడుగా అక్షయ్ కుమార్, రుద్రుడుగా ప్రభాస్, పార్వతీ మాతగా కాజల్ నటిస్తున్నారు. సగమై.. చెరిసగమై పాటను విష్ణు, ప్రీతి ముకుందన్‌‍లపై చిత్రీకరించారు.