బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (08:12 IST)

ప్రజలకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు.. త్వరలో కొత్త రేషన్ కార్డులు

ration card
ఏపీ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్టు పేర్కొంది. కుటుంబాల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్పు, కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చిరునామా మార్పు, కార్డు సరెండర్ వంటి పనులు ఈ కార్యక్రమంలో చేపడుతారు. ఈ దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఈ కొత్త రేషన్ కార్డుల జారీపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. 
 
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వ వంద రోజుల పాలన సందర్భంగా కొత్తగా రేషన్ కార్డుల జారీ, పౌర సరఫరాల శాఖలో ఇతర సమస్యల పరిష్కారాన్ని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది. ఆ మేరకు వైకాపా ప్రభుత్వం చెల్లించకుండా పెండింగులో పెట్టిన ధాన్యం బకాయిలు రూ.1,674.40 కోట్ల మొత్తాన్ని ఎన్డీయే సర్కారు చెల్లించింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే తొలి విడతగా రూ.1000 కోట్లు, తర్వాత రెండో విడతగా రూ.674.40 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది.
 
వాహనాల ద్వారా రేషన్ సరకుల పంపిణీపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. 6 వేల రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్తగా 4 వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలకు మించితే, ఆ కుటుంబాలు రేషన్ కార్డుకు అర్హులు కావని గత ప్రభుత్వం నిర్ణయించింది. 
 
దీంతో అంగన్వాడీ కార్యకర్తలు, పొరుగు సేవల ఉద్యోగుల కార్డులు రద్దయ్యాయి. వారి కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యాయి. తమకు వచ్చేదే తక్కువ జీతమని, రేషన్ కార్డుల తొలగింపు వల్ల నష్టపోతున్నామని వారంతా ఆవేదనతో ఉన్నారు. ఈ ప్రభుత్వం కుటుంబ ఆదాయ పరిమితిని పెంచి, కొత్తగా కార్డులు జారీ చేయాలని వారు కోరుతున్నారు.