పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా... ఎవరికీ చెక్ పెడతామండీ : మంత్రి నాదెండ్ల
పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడ్డాగా మారిపోయిందని, ఇక్కడ ప్రత్యేకించి ఎవరికి చెక్ పెడతామండీ అంటూ ఏపీ మంత్రి, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కకపోవడం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. జనసేన నేతలు అడ్డుపడే వర్మకు ఎమ్మెల్సీ టిక్కెట్ రాకుండా చేశారంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు.
వర్మ చాలా సీనియర్ రాజకీయ నేత. ఆయన కూడా సుధీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశారు. గతంలో ఎన్నో ఇబ్బందులుపడటం మనమంతా చూశామన్నారు. అయితే, పదవులు, టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలన్నది ఆయా పార్టీల అంతర్గత విషయమన్నారు. వర్మ విషయం కూడా టీడీపీ అంతర్గత విషయమని చెప్పారు. గత ఎన్నికల్లో ఆయన పవన్ కళ్యాణ్కు ఎంతగానో సహకరించారన్నారు. ఆయనపై తమకు గౌరవరం ఉందని, ఆయనకు సముచిత గౌరవం దక్కాలని కోరుకుంటున్నామని తెలిపారు.
పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఉంటే తాను పదవి తీసుకోకుండా ఇతరులకు పదవి ఇచ్చే వ్యక్తి అని గుర్తుచేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును జనసేన పార్టీలో చేర్చుకోవడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవన్నారు. ఆయన ద్వారా వర్మకు చెక్ పెట్టాల్సిన పని లేదన్నారు. పైగా, దొరబాబు ఎంతో సౌమ్యుడన్నారు.
ఎన్నికలకు ముందే తమ పార్టీలో చేరాలని భావించారని కానీ రాలేకపోయారని చెప్పారు. ఆయన మా కుటుంబంలో ఒకరిగా ఉండే వ్యక్తి అని చెప్పారు. ఆయన ద్వారా వర్మకు చెక్ పెట్టాలన్న ఆలోచనలు, అవసరం ఏముందని ప్రశ్నించారు. పైగా, కంప్లీట్గా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ అడ్డాగా మారిపోయిందన్నారు. ఇకదాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.