నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?
నల్లమల అడవుల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని స్థానిక ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాం జిల్లా అర్థవీడు మండలంలోని పలు ప్రాంతాల్లో గత మూడు నెలలుగా పెద్దపులి సంచరిస్తూ పశువులను చంపేస్తుంది. దీంతో పశువుల కాపరులు, ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో సంచరించి పెద్దపులి పాదముద్రలను సేకరించారు.
ఈ క్రమంలో మార్కాపురం డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ ప్రసాద్ రెడ్డి ప్రజలకు కీలక సూచనలు చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు సాయంత్రం 5 గంటలకు నుంచి ఉదయం 7 గంటల వరకు ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని సూచించారు.
అర్థవీడు మండలంలో గత మూడు నెలలుగా పలు ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తూ పశువులను చంపుతున్నదని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని, పెద్దపులి పాదముద్రలను తమ సిబ్బంది సేకరించినట్టు ఆయన వెల్లడించారు.