ప్రధానిని చూస్తే చంద్రబాబుకు అన్ని తడిసిపోతాయ్ : సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి
ప్రధాని నరేంద్రమోడీ వద్దకు వెళితే చాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్ని వణికిపోతాయని, తడిసిపోతాయని సిపిఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై ఏదో సాధిస్తానని చెప్పి ఒక్కటంటే ఒక్క హామీ కూడా ప్రధాని నుంచి చంద్రబాబు తీసుకురాలేకపోయారని విమర్శించారు. 12 అంశాలను ప్రధాని ముందుంచిన చంద్రబాబు వాటిలో ఒక్క అంశంపై స్పష్టత తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం జరుగుతోందని, దీనిపై కేంద్రప్రభుత్వం, కేంద్ర జలసంఘం స్పందించాలన్నారు. చంద్రబాబు అభివృద్ది మొత్తం అమరావతిలోనే చేస్తున్నారని, 13 జిల్లాలను గాలికొదిలేశారన్నారు. అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎపికి లోటు బడ్జెట్ రూ.13,275 కోట్లు ఉంటే కనీసం ఒక్కరూపాయి కూడా ప్రధాని ఇవ్వలేదని ఆరోపించారు.