మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 మే 2016 (08:29 IST)

కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూశారు.. అందుకే టీడీపీలో చేరుతున్నా : ఎస్వీ మోహన్ రెడ్డి

కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి వైకాపాకు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌ వైఖరి పట్ల తీవ్ర మనస్తాపంతో తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. కేవలం కర్నూలు నగర అభివృద్ధి కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ ఆయన వెల్లడించారు. 
 
2014 ఎన్నికల్లో కర్నూలు నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన ఆయన.. టీడీపీ అభ్యర్థి టీజీ వెంకటేశ్‌పై విజయం సాధించారు. తన బావ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, మేనకోడలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ టీడీపీలో చేరినప్పటి నుంచి ఎస్వీ కూడా అదే బాటలో నడుస్తారని ప్రచారం జరుగుతోంది. దానిని నిజం చేస్తూ శుక్రవారం విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని మోహన్‌రెడ్డి ప్రకటించారు. 
 
నా చెల్లెలు శోభానాగిరెడ్డి మరణించాక నా మేనకోడలు అఖిలప్రియను ఆళ్లగడ్డ ప్రజలు ఎంతో నమ్మకంతో ఆదరిస్తున్నారు. అయితే అఖిలప్రియ టీడీపీలో చేరాక జగన్‌ నుంచి నాపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. నా సొంత చిన్నాన్న ఎస్వీ నాగిరెడ్డిని రానున్న ఎన్నికల్లో అఖిలప్రియపై పోటీ చేయించాలని జగన్‌ పదేపదే ఒత్తిడి తెచ్చారు అని వెల్లడించారు. 
 
అలాగే, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్‌ కర్నూలులో దీక్ష చేపడుతున్న విషయం మాటమాత్రమైనా తనకు చెప్పకపోవడం బాధ కలిగించిందన్నారు. ఇవన్నీ భరించలేక, ప్రజలకు ఎంతో కొంత చేయాలన్న ఆలోచనతో టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. అధికారం కోసమో, మంత్రి పదవులకోసమో పాలక పార్టీలో చేరడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో వైకాపాలో ఉండలేక శనివారం కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరుతున్నట్లు ప్రకటించారు.