శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : బుధవారం, 22 మే 2019 (12:39 IST)

ఓట్ల లెక్కింపు ఎలా చేపడుతారు?

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు భద్రంగా ఉన్నాయి. ఈ స్ట్రాంగ్ రూమ్‌లకు ఐదు అంచెల భద్రత కల్పించారు. అయితే, దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో (మే 23వ తేదీ ఉదయం 8 గంటలకు) ప్రారంభంకానుంది. ఈ లెక్కింపుపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొనివుంది. 
 
అయితే, ఓట్ల లెక్కింపు ఎలా చేపడుతారో ఇపుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎంతో క్లిష్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రత్యేక పద్ధతివుంది. ప్రతీ అంశమూ చాలా జాగ్రతగా పరిశీలిస్తూ అధికారులు ముందుకుసాగుతారు. ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కానీ, లెక్కింపునకు 4 గంటలకు ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. 
 
సిబ్బంది తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు ఉదయం 4 గంటలకంతా చేరుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా 5 గంటలకు వారికి లెక్కింపు చేయాల్సిన టేబుల్స్ కేటాయిస్తారు. ఆ తర్వాత సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం చేయిస్తారు. లెక్కింపులో గోప్యత పాటిస్తామని ప్రమాణం చేయిస్తారు. 
 
ఆ తర్వాత సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30 వరకూ ఇది నడుస్తుంది. అయితే, పోస్టల్ ఓట్లు ఎక్కువ ఉండి సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. ఒక నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్‌లు లెక్కిస్తారని ఒక అంచనా. దాదాపుగా  ఒక శాసనసభ నియోజకవర్గానికి 2 వేలు, లోక్‌సభ నియోజకవర్గానికి 14 వేల వరకూ ఓట్లుంటాయని అంచానా. 
 
నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు.. వాటి పరిధిలో పోలైన ఓట్లు ప్రాతిపాదికన ఎన్ని రౌండ్‌లు అవసరమవుతాయో నిర్ణయిస్తారు. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం పడుతుంది. 14-15 టేబుళ్ళ‌పై లెక్కింపు జరుగుతుంది. ఒకసారి మొత్తం టేబుళ్ళ‌పై ఉన్న ఈవీఎంల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టు. 
 
ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత వీపీప్యాట్‌ల స్లిప్పుల లెక్కింపు మొదలవుతుంది. ముందుగా దీనికోసం ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్యలను చీటీలపై రాసి వాటిని లాటరీ తీస్తారు. ఏయే పీవీ ప్లాట్‌ల స్లిప్పులు లెక్కించాలో లాటరీ ద్వారా నిర్ణయించిన తర్వాత వాటి లెక్కింపు మొదలు పెడతారు. 
 
ఈ లెక్కింపులో ఈవీఎంల లెక్కింపులో వచ్చిన ఒట్లకూ వీవీప్యాట్‌ల స్లిప్‌ల ఓట్లకు మధ్య వ్యత్యాసముంటే తిరిగి స్లిప్పులను రెండోసారి లెక్కిస్తారు. ఇలా మూడు సార్లు చేస్తారు. అప్పటికీ తేడా వస్తే స్లిప్పుల‌లోని లెక్కనే పరిగణనలోకి తీసుకుంటారు. స్థూలంగా ఇదీ లెక్కింపు ప్రక్రియ. ఈవీఎంల లెక్కింపు పూర్తయే సరికే అనధికారికంగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసిపోతుంది. 
 
కానీ, పీవీ స్లిప్పుల లెక్కింపు పూర్తయ్యే దాకా అధికారికంగా ప్రకటించరు. అంటే దాదాపు సాయంత్రం 4 గంటల సమయానికి మెజార్టీ స్థానాల అనధికార సమాచారం వచ్చేస్తుంది. తర్వాత వీవీ ప్యాట్‌ల స్లిప్పుల లెక్క తేలడానికి రాత్రి 11 గంటలు దాటోచ్చని అంచనా.