1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (19:41 IST)

సంపూర్ణ విద్యతోనే చిన్నారుల సర్వతోముఖాభివృద్ది: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

బాల్యం నుండే సంపూర్ణ విద్యను అందించటం ద్వారా చిన్నారుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. 

సమాజం ఎదుర్కుంటున్న సంక్షోభాలను ఎదుర్కునే క్రమంలో ఈ విధానం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుందన్నారు.

‘సంపూర్ణ విద్యతో జీవితంలో శ్రేష్ఠత’ అనే అంశంపై ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం శనివారం నిర్వహించిన అంతర్జాతీయ విద్యా సదస్సుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఆన్ లైన్ విదానంలో కార్యక్రమం జరగగా విజయవాడ రాజ్ భవన్ నుండి శ్రీ హరిచందన్ మాట్లాడుతూ ఆలోచనాపరులు, తత్వవేత్తలు ఊహించినట్లుగా  ఘోరమైన కరోనా మహమ్మారి శిధిలాల నుండి ఉద్భవించే ప్రపంచం, మనం ఇంతకు ముందు చూసిన . అనుభవించిన ప్రపంచానికి భిన్నంగా మారుతుందన్నారు. 

సంపూర్ణ అభివృద్ధి సాధించిన పిల్లలు మేధో, మానసిక, శారీరక, భావోద్వేగ, ఆధ్యాత్మిక సామర్థ్యాలను కలిగి ఉండటం ద్వారా రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్దంగా ఉంటారని గవర్నర్ పేర్కొన్నారు. ప్రాపంచిక విద్య చిన్నారులు ప్రపంచంలో తమ స్ధానాన్ని ఎంచుకోవటానికి సహాయపడుతుందన్నారు.

ప్రస్తుత పరిస్థితులలో పిల్లలలో నెలకొంటున్న ఒత్తిడి, ఆందోళన వారిలో నిశ్చితికి దారితీస్తుందని, వారు నిర్బంధ వాతావరణంలో పెరగటం వల్లే ఈ పరిస్ధితులు ఏర్పడుతున్నాయని గవర్నర్ అన్నారు.  ఈ పరిణామాలు తల్లిదండ్రులకు తమ చిన్నారుల భవిష్యత్తు పట్ల ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. 

భయం, ఆందోళన, అనిశ్చితి ఉన్న ఈ కాలంలో జీవితాన్ని ఇచ్చే విద్య అన్న అంశంపై  దృష్టి పెడుతూ ఆధ్యాత్మిక,  నైతిక విలువలను బోధించడం ద్వారా సమాజంలో దైవత్వాన్ని వ్యాప్తి చేయడానికి బ్రహ్మ కుమారిస్ చేస్తున్న కృషిని ప్రశంసనీయమన్నారు. 

కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయ యుకీ, రాజ యోగా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ జాతీయ సమన్వయకర్త  బ్రహ్మ కుమారిస్ శైలు, బ్రహ్మ కుమారిస్ శాంతివన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ మృత్యుంజయ,  బ్రహ్మ కుమారిస్ ఆస్ట్రేలియా జాతీయ సమన్వయకర్త చార్లెస్ హాగ్ తదితరులు పాల్గొన్నారు.