1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (12:40 IST)

మిల్కా సింగ్ మృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దిగ్భ్రాంతి

స్ప్రింట్‌ దిగ్గజం మిల్కా సింగ్ మృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కోవిడ్ అనంతర సమస్యల కారణంగా దిగ్గ‌జ క్రీడాకారుడు మృతి చెందటం బాధాకరమన్నారు.

మిల్కా బ‌ల‌మైన వ్య‌క్తిత్వం భావి త‌రాల‌కు ఆద‌ర్శమని కొనియాడారు. దేశం విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయింద‌ని  కోట్లాది మంది హృద‌యాల్లో మిల్కా ప్ర‌త్యేక స్థానం పొందార‌ని గవర్నర్ అన్నారు. ప్ర‌పంచ అథ్లెటిక్స్ లో మిల్కా చెర‌గ‌ని ముద్ర వేశారని, గొప్ప క్రీడాకారుడిగా దేశం మిల్కాను ఎప్పుడూ స్మ‌రిస్తుంద‌న్నారు.

కామన్వెల్త్ క్రీడల్లో వ్యక్తిగత అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్ శ్రీ మిల్కా సింగ్ అని, మెల్బోర్న్, రోమ్, టోక్యోలో జరిగిన సమ్మర్ ఒలింపిక్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించారని గవర్నర్ హరిచందన్ ప్రస్తుతించారు.

గవర్నర్  మాట్లాడుతూ, 1960 రోమ్ ఒలింపిక్స్ ఫైనల్లో  45.73 సెకన్లతో నాల్గవ స్థానంలో నిలిచి అద్భుతమైన రికార్డును శ్రీ మిల్కా సింగ్ కలిగి ఉన్నారని, 1959 లో పద్మశ్రీ అవార్డుతో గౌరవం పొందారని వివరించారు.

దివంగత మిల్కా సింగ్ కుటుంబ సభ్యులకు గవర్నర్ హరిచందన్ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.