మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (15:27 IST)

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తలుపుతట్టింది. స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో సంభవించిన అగ్నిప్రమాదంపై తదుపరి విచారణను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టు గడపతొక్కింది. 
 
విజయవాడకు చెందిన రమేష్ ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ బాధితుల కోసం స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం జిల్లా కలెక్టర్ అనుమతితో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే, దురదృష్టవశాత్తు ఈ క్వారంటైన్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించడంతో 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారు. 
 
దీంతో స్వర్ణప్యాలెస్‌, రమేష్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పి.రమేష్ బాబు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సీతా రామమోహన్ రావులపై ఏపీ సర్కారు కేసు నమోదు చేసి, అరెస్టు చేసేందుకు సర్కారు పూనుకుంది. దీంతో రమేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
 
అంతేకాకుండా, స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో అంతకుముందు ప్రభుత్వం క్వారంటైన్‌ కేంద్రాన్ని నిర్వహించిన నేపథ్యంలో... 'స్వర్ణ ప్యాలెస్‌ సురక్షితం కాదని తెలిసినప్పుడు అక్కడ క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు సబ్‌కలెక్టర్‌ ఎలా అనుమతిచ్చారు? స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ క్వారంటైన్‌ కేంద్రం నిర్వహించే ముందు సబ్‌కలెక్టర్‌ అసలు విచారణ జరిపారా? హోటల్‌ను పరిశీలించారా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. 
 
పైగా, ఈ వ్యవహారానికి సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, డీఎంహెచ్‌వోలను నిందితులుగా ఎందుకు చేర్చలేదని నిలదీసింది. వారిని నిందితులుగా చేర్చేదాకా ఈ కేసులో ముందుకెళ్లడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.