మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఒక జిల్లా వారు మరో జిల్లాలో ఫ్రీగా ప్రయాణించడానికి వీల్లేదు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని అమలు చేసే దిశగా ఇప్పటికే దృష్టిసారించింది. గత ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణ హామీని తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు.
ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఉంటుందన్నారు. అయితే ఒక జిల్లావారు మరో జిల్లాలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లేదని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ విషయంపై స్పష్టతనిస్తున్నట్టు పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పై విధంగా మంత్రి సంధ్యారాణి అలా సమాధానమిచ్చారు.
కాబోయే భార్యతో ఉరివేసుకున్నట్టుగా సెల్ఫీ దిగిన యువకుడు..
తనకు కాబోయే భార్యతో సరదాగా మాట్లాడుతూ, ఉరివేసుకుంటున్నట్టుగా నాటకమాడిన ఓ యువకుడి కథ విషాదాంతంగా ముగిసింది. పొరబాటున వైర్ మెడకు బిగుసుకోవడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం మేరకు... తిలక్ నగర్కు చెందిన క్యాబ్ డ్రైవర్ గ్యార ఆదర్శ్ (25)కు ఇటీవలే ఓ యువతితో వివాహం జరిగింది. వచ్చే నెలలో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. ఇక వివాహానికి సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాల సభ్యులు మొదలుపెట్టారు. అయితే, వివాహ నిశ్చితార్థం కావడంతో యువతీయువకులిద్దరూ ఫోనులో తరచుగా మాట్లాడుకోసాగారు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి తనకు కాబోయే భార్యను ఆదర్శ్ ఆటపట్టించాలని భావించాడు. ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా నాటకం ఆడాలని భావించిన ఆదర్శ్.. ఫ్యాన్కు ఐరన్ బాక్స్ వైరుతో ఉరి వేసుకుంటున్నట్టుగా సెల్ఫీ ఫోటో దిగాడు. ఆ ఫోటోను కాబోయే భార్యకు వాట్సాప్ ద్వారా పంపించాడు.
ఆ తర్వాత కిందకు దిగే ప్రయత్నంలో ఉండగా, ప్రమాదవశాత్తు ఆదర్శ్ మెడకు వైర్ బిగిసుకుంది. ఆ సమయంలో అతన్ని కాపాడేందుకు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆదర్శ్ మృతి చెందాడు. మంగళవారం ఉదయం ఆదర్శ్ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా విగతజీవుడై కనిపించాడు. దీంతో వారంతా బోరున విలపిస్తూ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.