శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (12:21 IST)

గ్రామ సచివాలయ ఉద్యోగులకు షాక్... ఉద్యోగం మానేస్తే జీతం వెనక్కి ఇవ్వాల్సిందే...

బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కలను సాఫల్యం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పింది. ఇందుకోసం 8 నుంచి పది మందిని ఉద్యోగులుగా నియమించింది. వీరికి నియామకపత్రాలను అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, గాంధీ జయంతి రోజున గ్రామా సచివాలయాలను కూడా ప్రారంభించారు. 
 
ఈ ఉద్యోగులు తమ విధుల్లో చేరి కొన్ని గంటలు గడవక ముందే వారికి జగన్ సర్కారు తేరుకోలేని షాకిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారు రెండేళ్లు ప్రొబేషనరీ ఉంటుందని వారికిచ్చిన ఆర్డరల్లో పేర్కొన్నారు. 
 
అంతేకాదు ప్రతి ఉద్యోగి మూడేళ్లు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుందని, మధ్యలో ఉద్యోగం మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించాలన్నారు. దీంతో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందుకున్న అనేక మంది అభ్యర్థులు అయోమయంలో పడ్డారు.
 
ఉద్యోగాలు పొందినవారిలో ఎక్కువ మంది గ్రూప్‌ పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులే ఉన్నారు. ఇప్పటికే గ్రూప్‌-2, 3 పరీక్షలు రాసిన వారు ఫలితాల్లో మంచి మార్కులొస్తే ఆ ఉద్యోగాలకు వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ఈ నిబంధనలు పెట్టడంతో అభ్యర్థులు డీలా పడుతున్నారు.