1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 20 జనవరి 2022 (17:15 IST)

నాడు టీచ‌ర్ల‌తో మ‌ద్యం అమ్మించారు... నేడు పోలీసులతో కొట్టించారు

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులపై జరిగిన దాడిని ఏపీ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత సుంకర పద్మశ్రీ  ఖండించారు. ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన వైఖరిపై ఆమె ఆగ్రహం కూడా వ్య‌క్తం చేశారు. గురు బ్రహ్మ... గురు విష్ణు... గురు దేవో మహేశ్వరః అంటూ గురువును దైవంతో పోలుస్తారు, అలాంటి వారిపై వైసీపీ ప్రభుత్వం దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు.
 
 
తమ హక్కుల కోసం పోరాడుతున్న టీచర్లపై లాఠీలు ఝుళిపించడం దుర్మార్గం అని సుంక‌ర ప‌ద్మ‌శ్రీ పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత టీచర్లను మద్యం షాపుల ముందు కాపలా ఉంచార‌ని, మద్యం డబ్బుల కోసం టీచర్ల చేత మద్యం అమ్మించార‌ని పేర్కొన్నారు. ఇపుడు పి ఆర్ సి పై ఆందోళన చేస్తుంటే పోలీసులతో కొట్టించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

 
విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారంటే జగన్ పాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని సుంక‌ర ప‌ద్మ‌శ్రీ అన్నారు. చిన్నప్పుడు జగన్ టీచర్ చేతిలో దెబ్బలు తిని ఉంటే, ఇలా అర్ధంలేని పనులు చేసేవారు కాద‌ని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే విమర్శలు చేసి నేను అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ మంచి చేస్తానని నమ్మించార‌ని, ఉపాధ్యాయులపై చెయ్యి చేసుకుని ముఖ్యమంత్రి జగన్ చేయకూడని పాపం చేశార‌ని అన్నారు. ప్రభుత్వ ఆదాయం పెరిగిందని కాగ్ చెబుతుంటే డబ్బులు లేవని ముఖ్యమంత్రి, సీఎస్ చెప్పడం వెనుక అంతర్యం ఏంటి అని ఆమె ప్ర‌శ్నించారు.

 
కోవిడ్ సమయంలో చాలా మంది ఉపాధ్యాయులు చనిపోయార‌ని, వారి కుటుంబాలను ప్రభుత్వం గాలికి వదిలేసింద‌ని ఆమె విమ‌ర్శించారు. ఉపాధ్యాయులను అరెస్టు చేయడం అంటే, చదువుల తల్లిని అరెస్ట్ చేయడమేన‌ని, ముఖ్యమంత్రి జగన్ పట్టింపులకు పోకుండా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాల‌ని డిమాండు చేశారు.