శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 డిశెంబరు 2020 (09:39 IST)

బలహీనపడినా ప్రభావం తగ్గని బురేవి.. ఆంధ్రాకు విస్తారంగా వర్షాలు!

బంగాళాతంలో ఏర్పడిన అల్పపీడనం తొలుత వాయుగుండంగా, ఆపై తుపానుగా మారిన బురేవి ఈ నెల 4వ తేదీ ఉదయం తమిళనాడులోని కన్యాకుమారి, పంబం తీరంలో తీరాన్ని దాటింది. అయితే, ఇది తీరందాటకముందే బలహీనపడింది. అయినప్పటికీ.. దీని ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ఫలితంగా అటు తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు.. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 
 
ఇదే అంశంపై భారత వాతావరణ శాఖ ఓ ప్రకటన జారీచేసింది. బురేవి తుపాను బలహీనపడి అల్పపీడనంగా ఇంకా బంగాళాఖాతంలో కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడులోని అనేక ప్రాంతాలతో పాటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి.
 
ముఖ్యంగా, ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశమున్నట్టు తెలిపింది. 
 
కాగా, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తమిళనాడు తీరం దాటి అరేబియా సముద్రంలో ప్రవేశిస్తుందని, ఆపై క్రమంగా బలపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.