1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (17:51 IST)

జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కొత్త మంత్రులు వీరిద్దరే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం బుధవారం జరుగనుంది. అందుకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 1.29 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఇప్పటివరకు మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల స్థానంలో మరో ఇద్దరు కొత్తమంత్రులతో బుధవారం మధ్యాహ్నం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. బుధవారం ఒంటిగంటకు సీఎం జగన్ రాజ్‌భవన్ చేరుకుని కొత్త మంత్రుల ప్రమాణస్వీకారంలో పాలుపంచుకుంటారు.
 
ఇప్పటివరకు మంత్రిగా ఉన్న మోపిదేవి, డిప్యూటీ సీఎంగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నికైనందున వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరిస్థానంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మంత్రి పదవులు చేపడతారని తెలుస్తోంది.
 
ఇదిలావుంటే, శ్రీకాకుళం జిల్లా నుంచి అనూహ్యంగా మంత్రివర్గంలో స్థానాన్ని దక్కించుకున్న పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు స్పందించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం వంటి సీనియర్లు మంత్రి పదవిని ఆశించినప్పటికీ... డాక్టర్ అప్పలరాజును అదృష్టం వరించింది.
 
ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి దక్కుతుందని ఊహించలేదని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ఇప్పుడు తనపై బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని అన్నారు.