గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2023 (14:28 IST)

విశాఖ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

laxminarayana
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా విశాఖపట్టణం లోక్‌సభ నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఆయన విశాఖ నుంచి పోటీ ఓడిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తలెత్తిన చిన్నపాటి మనస్పర్థలు కారణంగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 
 
ఇపుడు మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? మళ్లీ విశాఖ నుంచి బరిలో దిగుతారా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తన రాజకీయ భవిష్యత్ పై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.
 
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీలో చేరబోనని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని వెల్లడించారు. ఎక్కడి నుంచి  అనేది ఇంకా నిర్ణయించుకోలేదని, త్వరలోనే చెబుతానని వివరించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానం చూస్తే విశాఖ కేంద్ర బిందువుగానే ఆయన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 
 
విశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవహారంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌కు మేలు జరిగితే అదే చాలు అనే ఉద్దేశంతో ఆయన ఆఖరికి కేఏ పాల్ వంటి నేతను కూడా కలిశారు. ఓ దశలో స్టీల్ ప్లాంట్‌ను కొనడానికి బిడ్ దాఖలు చేసి, క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూలధన నిధుల సేకరణకు కూడా నడుం బిగించారు.