1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (13:55 IST)

రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహా బ్లాక్‌లో చంద్రబాబుకు ప్రత్యేక గది

chandrababu
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైలులో తరలించారు. అక్కడ చంద్రబాబుకు ప్రత్యేక గదిని స్నేహా బ్లాక్‌లో కేటాయించారు. ఆ గది వద్ద ఐదుగురు సిబ్బందితో ఆయనకు భద్రతకు కల్పించారు. అలాగే, ఆయనకు ఒక సహాయకుడిని కూడా నియమించారు. ఆయనకు ఆహారం, మందులను సహాయకుడు దగ్గరుండి అందిస్తాడు. చంద్రబాబు మంచి చెడ్డలను సహాయకుడు చూసుకుంటాడు. మరోవైపు, కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు ఇంటి ఆహారాన్ని అందించనున్నారు. టీడీపీ అధినేతకు జైల్లో అన్ని వసతులను కల్పించారు.
 
మరోవైపు, జైలుకు తరలించిన తర్వాత చంద్రబాబు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు నిద్రకు ఉపక్రమించినట్టు సమాచారం. ఉదయం 8 గంటల వరకు ఆయన పడుకున్నారు. ఈరోజు చంద్రబాబును కలిసే వారికి ములాఖత్‌కు అనుమతించే అవకాశం ఉంది. భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్‌ను ములాఖత్‌కు అనుమతించవచ్చు. అల్పాహారం తీసుకున్న తర్వాత ములాఖత్‌కు అనుమతించే అవకాశం ఉంది.
 
ఇదిలావుంటే, రాజమండ్రి సెంట్రల్ జైల్ చుట్టూ 300 మంది పోలీసులు మోహరించారు. నగరంలో సెక్షన్ 30 విధించారు. రాజమండ్రి మొత్తం పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. 36 పికెటింగ్‌లతో పహారా కాస్తున్నారు. మరోవైపు, ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.