1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 మే 2021 (14:37 IST)

ఆ క్రెడిట్ కోసం గుంట నక్కలా స్కెచ్ వేస్తున్న చంద్రబాబు : విజయసాయిరెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య క్రెడిట్‌ను కొట్టేసేందుకు చంద్రబాబు గుంటనక్కలా వ్యూహాలు పన్నుతుంటారంటూ ఆరోపించారు. 
 
ఇదే అంశంపై విజయసాయి మంగళవారం మాట్లాడుతూ, నలుగురు వ్యక్తులు ఎవరి గురించైనా అభిమానంగా చర్చించుకుంటున్నా, మీడియాలో హడావుడి కనిపించినా బాబు వక్ర దృష్టి అటు పడుతుందని విమర్శించారు. అందులోకి ఎలా దూరాలా? అని ఆలోచిస్తాడని అన్నారు. 
 
ఇప్పుడు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు వస్తున్న క్రెడిట్‌ను ఎలా కొట్టేయాలా అని గుంటనక్కలా స్కెచ్ వేస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నదీనదాలు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి? అన్న శ్రీశ్రీ మాటలను టీడీపీవారు మరోలా అర్థం చేసుకున్నారని విజయసాయి అన్నారు. 
 
ల్యాండ్ కనిపిస్తే చాలు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పచ్చజెండా పాతేశారు అని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ సొసైటీ బోర్డునే తొలగించి కబ్జా చేసిన వారికి... విశాఖ భూములు ఒక లెక్కా? వైసీపీ వచ్చిన తర్వాత వీరి కబ్జాలకు తెరపడిందని అన్నారు.
 
చంద్రబాబు హయాంలో కార్పొరేట్ హాస్పిటళ్లను పెంచి పోషించేందుకే పనికొచ్చిన ఆరోగ్యశ్రీని... ఈ రెండేళ్లలో సీఎం జగన్ సంజీవనిగా మార్చారని విజయసాయి కొనియాడారు. 95 శాతం మంది ప్రజలు దీని పరిధిలోకి వచ్చారని... కరోనా, బ్లాక్ ఫంగస్‌లను ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ జగన్ భరోసా కల్పించారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు.