శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జనవరి 2021 (16:36 IST)

ఏపీలో విగ్రహాలకు రక్షణ లేదు... అదే చర్చి అయితే... : చిన్నజీయర్ స్వామి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాల్లోని విగ్రహాలపై జరుగుతున్న దాడులపై త్రిదండి చిన్నజీయర్ స్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఆలయాల్లోని దేవుళ్లకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అదే చర్చో, మసిదుపైనో దాడి జరిగివుంటే ప్రపంచం మొత్తం కదలేదని ఆయన గుర్తుచేశారు. 
 
తాడేపల్లిలోని విజయకీలాద్రిపై చినజీయర్ స్వామీజీ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ధనుర్మాసం పూర్తికాగానే ఓ క్రమంలో ఏయే ఆలయాలపై దాడులు జరిగాయో.. వాటన్నింటినీ సందర్శిస్తామన్నారు. ఈ నెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా యాత్రను చేపట్టనున్నట్లు చినజీయర్ ప్రకటించారు. అయితే ఏ ప్రాంతం నుంచి యాత్ర చేపట్టాలన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని, త్వరలోనే నిర్ణయించుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
 
ఏపీలో ఆలయాలపై జరుగుతున్న వరుస ఘటనలనతో తాను కలత చెందినట్టు చెప్పారు. ఏపీ ఆలయాల్లో విగ్రహాలకు ఏమాత్రం రక్షణ లేదని, రక్షణ పూర్తిగా కొరవడిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. 
 
ఏపీలో ఆలయాలన్నీ దెబ్బతగిలిన బాధాకరమైన స్థితిలో ఉన్నాయని, వాటికి తక్షణంగా ఎలాంటి ఉపశమనం కల్పించాలన్న దానిపై ఆలోచిస్తామని తెలిపారు. ఈ ఏపీలో ఆలయాల ఉనికికే భంగం వాటిల్లిందని, ఈ సమయంలో మౌనంగా ఉండటం శ్రేయస్కరం కాదని అనిపించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 
 
ఏ దేవాలయాల్లోనూ సీసీ కెమెరాలు పెట్టలేదని, రామతీర్థంలో విగ్రహ విధ్వంసం తర్వాత సీసీ కెమెరాలు పెట్టారని అన్నారు. దేవాలయాలకు రక్షణ వ్యవస్థ కల్పించాలని అవసరం ఉందన్నారు. దెబ్బతిన్న ఆలయాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఏం చేస్తే బాగుటుందనే దానిపై పెద్దలతో కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. 
 
ఇలాంటి దాడులు చర్చి, మసీదులపై జరిగినా కూడా తీవ్రంగా స్పందించాలని కోరారు. దేవాలయం స్థానంలో చర్చి కానీ, మసీదు కానీ ఉంటే ప్రపంచం మొత్తం కదిలేదని, ఆలయాలను ఆసరాగా చేసుకొని జీవించే వారు శాంతియుతంగా ఉంటారన్నారు. యాబైకి పైగా విగ్రహాలపై దాడులు జరిగాయని అధికారింగానే తెలుస్తోందని, స్థానికంగా ఉన్న వారికి ఎలాంటి భయాందోళనలు కలగకుండా నైతిక మద్దతివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి వక్కాణించారు.