శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (10:35 IST)

గడ్డివాము వద్ద అనుమానాస్పదంగా సీఐడీ డీఎస్పీ మృతదేహం!!

deadbody
రాజమండ్రిలో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. పోలీస్ శాఖలో ఎస్ఐ విధుల్లో చేరి సీఐడీ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ వచ్చిన ఓ పోలీస్ అధికారి అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాజమండ్రిలోని ఓ గడ్డివాము వద్ద అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించాడు. తొలుత ఆయనను గుర్తు తెలియని వ్యక్తిగా భావించారు. ఆ తర్వాత ఆయనను డీఎస్పీగా స్థానికులు గుర్తించారు. 
 
పోలీసుల కథనం మేరకు.. గాంధీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ఎంటీ గోదాము సమీపంలో సాయిబాబా గుడివద్ద ఓ మృతదేహం పడివుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన ఫోటోను వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్ చేయగా, కొద్దిసేపటికే ఆయన కర్నూలు జిల్లా ఆప్సరికి చెందిన  సీఐడీ డీఎస్పీ నాగరాజు (54)గా గుర్తించారు. 
 
ఈయన యేడాది క్రితం రాజమండ్రిలోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి బదిలీ అయ్యాడు. స్థానికంగా ఉండే ఓ లాడ్జీలో ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో గత యేడాది డిసెంబరు నుంచి మెడికల్ లీవులో ఉన్నారు. ఈ నెల 2వ తేదీన కర్నూలు నుంచి రాజమండ్రికి వచ్చారు. లాడ్జిలోనే బస చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన తన కుటుంబ సభ్యులతో చివరగా మాట్లాడారు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. 
 
ఈ విషయం తెలిసి హైదరాబాద్ నగరంలోని ఆయన కుమారుడు వంశీకృష్ణ గురువారం రాజమండ్రికికి చేరుకుని తండ్రి గురించి వాకబు చేశారు. దీంతో నాగరాజు విధులకు హాజరుకావడం లేదని మిగిలిన సిబ్బంది చెప్పారు. ఈ క్రమంలో వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన ఫోటోలు సీఐడీ సిబ్బంది గుర్తించి ప్రకాశం నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాగరాజు మృతి విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సివుంది.