1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (13:21 IST)

టీడీపీ నేతల బూతులకు ఇది రియాక్షన్ : వైకాపా నేతల దాడులపై సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు, శ్రేణులు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. ఈ విష సంస్కృతి గత రెండున్నరేళ్ళ కాలంలో ఏపీలో హెచ్చుమీరిపోయింది. ముఖ్యంగా, మంగళవారం ఈ సంస్కృతి మరింతగా పెట్రేగిపోయింది. ఈ దాడులు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 
 
ఈ నేపథ్యంలో వైకాపా శ్రేణులు జరిపిన దాడులపై ఏపీ సీఎం జగన్ బుధవారం స్పందించారు. ప్రభుత్వ పథకాల్ని చూసి ఓర్వలేక బూతులు తిడుతున్నారంటూ కౌంటర్‌ ఇచ్చారు. ఎవరు మాట్లాడని బూతులు ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.
 
ఈ బూతులను జీర్ణించుకోలేని నన్ను ప్రేమించే వాళ్లు, అభిమానించే వాళ్లు రియాక్షన్‌ చూపించారని.. దాని ప్రభావం రాష్ట్రంలో కనబడిందని.. కానీ, రెచ్చగొట్టి, వైషమ్యాలను సృష్టించి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.
 
ఇక, మీ చల్లని దీవెనలతో రెండేళ్లు పాలన అద్భుతంగా సాగిందన్నారు. ఇదేసమయంలో కొంతమంది కావాలని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు ఎలాంటి మేలు జరగకూడదు.. ప్రభుత్వ పథకాలు అమలు కాకూడదు.. అలా జరిగితే ప్రజలకు లబ్ధి చేకూరుతుంది, సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుంది.. తమకు మనుగడ ఉండదన్న భయంతోనే.. వాటిని అడ్డుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.