1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (19:20 IST)

హైదరాబాద్ టెక్కీకి కరోనా.. 80 మందితో కాంటాక్ట్.. అసలు సంగతేంటి? (video)

బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో పనిచేసే హైదరాబాద్ ఇంజనీర్‌కు కరోనా సోకింది. దీంతో తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. సోమవారం ఈ కరోనా కేసు వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. ఇంకా తెలుగు రాష్ట్ర ప్రజల్లో, ప్రభుత్వాలకు వణుకు పుట్టించింది. 24 ఏళ్ల ఈ టెక్కీ హైదరాబాద్ ప్రభుత్వ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. టెక్కీతో పాటు వున్న 80మందిని గుర్తించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఫిబ్రవరిలో ఓ కాన్ఫరెన్స్ కోసం దుబాయ్ వెళ్లిన హైదరాబాద్ టెక్కీ.. హాంకాంగ్‌కు చెందిన కొందరిని కలిశాడు. ఆ తర్వాత అతనికి కరోనా వచ్చి వుంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి 22వ తేదీ బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. 
 
ఈ టెక్కీకి జ్వరం రావడంతో సికింద్రాబాద్‌లోని అపోలోను సంప్రదించాడు. కానీ అక్కడ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు వైద్యులు. అతనికి కరోనా టెస్టులు నిర్వహించారు. అలా ఆ టెక్కీకి కరోనా సోకింది. ఇంకా హైదరాబాద్ టెక్కీతో పాటు కాంటాక్టులో వున్న దాదాపు 80మందిని గుర్తించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ 80మందిలో కుటుంబ సభ్యులు, బస్సు ప్రయాణీకులు వున్నారు. 
 
కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు. కరోనా సోకిన హైదరాబాద్ టెక్కీ హైదరాబాదు బస్సులో ప్రయాణించడమే కాకుండా.. బెంగళూరులోని అతని కార్యాలయంలో మూడు రోజుల పాటు ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో టెక్కీ కారణంగా ఇతరులకు కరోనా సోకిందా లేదా అనే విషయం ప్రభుత్వ అధికారులు ఆరా తీస్తున్నారు.