శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 డిశెంబరు 2019 (12:29 IST)

జగన్ ఆర్నెల్ల పాలన.. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆర్నెల్ల పాలనపై సీపీఎం ఏపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఈ 6 నెలల పాలన కొందరికి మోదంగా, మరికొందరికి ఖేదంగా గడిచింది. 
 
నవరత్నాల హామీల అమలుకు పూర్తిగా కాకపోయినా కొంత మేరకు కృషి జరిగింది. మంత్రివర్గకూర్పులో సామాజిక న్యాయం పాటించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అంటూ కొత్త ఉద్యోగాలు ఇచ్చారు.

కాని ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో అభద్రతాభావం నెలకొంది. ఇప్పటికే కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారు. 
 
ఇసుక పాలసీ అంటూ 5 నెలలపాటు ఇసుక సరఫరా ఆపివేయడంతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం పడింది. అన్నా కాంటీన్ల మూసివేతతో నిరుపేదలు, దినసరి కూలీలు ఇబ్బందుకు పడుతున్నారు.

ప్రతిపక్ష పార్టీలను ఖాతరు చేయడంలేదు. మంత్రులకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారంలేదు. అంతా జగన్ మయం. రాష్ట్రంలో ఏకపక్ష, మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోంది. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి 6 నెలల పాలన ప్రజలకు మిశ్రమ ఫలితాలనే మిగిల్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.