1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (11:43 IST)

27 న భారత్ బంద్ ...ప్ర‌ధాని మోదీ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై!

ప్ర‌ధాని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోలవరం ప్రాజెక్టుపై  నిర్లక్ష్య వైఖరికి నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య చెప్పారు. రాజమండ్రి పార్టీ కార్యాలయంలో సిపిఐ జిల్లా సమితి సమావేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు  నల్ల రామారావు అధ్యక్షతన జరిగింది.

ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడా కార్పొరేట్ సంస్థలు బాగుపడ్డాయని, చిరు వ్యాపారులు రోడ్డున  పడ్డారని అన్నారు. మోడీ విధానాలతో దేశం విదేశీ సంస్థలకు తాకట్టు అవుతోంద‌ని, పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరించడం దారుణమన్నారు.
 
దేశ రైతులకు న్యాయం చేస్తానని చెప్పిన మోడీ నేడు రైతులను నట్టేట ముంచడానికి 3 వ్యవసాయ బిల్లును తీసుకొచ్చార‌ని, 27 జరిగే భారత బందుకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. రైతులు చేపడుతున్న ఆందోళనకు మద్దతుగా మోడీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
 
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్ల వ్యవహారంపై లబ్ధిదారులను మభ్య పెట్టేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. నిరుపేదలు చాలా మంది వేలాది రూపాయలు అప్పు తెచ్చి ఇల్లు నిర్మాణం కట్టారని వారందరూ ఆర్థికంగా చితికిపోయారని ఇల్లు కేటాయించిన లబ్ధిదారులకు వాటికి అప్ప చెప్పకుండా జగనన్న కాలనీలకు లబ్ధిదారుల‌ను ప్రభుత్వం బలవంతంగా తరలిస్తోంద‌ని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, కార్యవర్గ సభ్యులు తోకల ప్రసాద్, నక్క కిషోర్, చెల్లుబోయిన కేశవ శెట్టి తదితరులు పాల్గొన్నారు.