శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (14:40 IST)

ఆ పేరు పెడితేనే శిశువు ఏడుపు ఆపుతుందట.. 400 యేళ్లుగా వింత ఆచారం!

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరిలో శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఆ గ్రామంలోని ప్రజలంతా గిడ్డ ఆంజనేయ స్వామి భక్తులే. తమకు పుట్టిన సంతానానికి ఆడ మగ అనే తేడా లేకుండా తప్పకుండా గిడ్డతో ప్రారంభమయ్యే పేరు పెట్టుకుంటారు. గిడ్డయ్య, గిడ్డమ్మ, గిడ్డా౦జనేయ, గిడ్డరెడ్ది, గిడ్డేయ్యసామి, రామ గిడ్డయ్య, సీత గిడ్డెమ్మ ఇలాంటి పేర్లు అక్కడ సర్వ సాధారణంగా వినిపిస్తాయి. గిడ్డ పేరుతో పేరు పెట్టకపోతే శిశువు ఏడుపు ఆపదట. ఆ పేరు పెట్టిన వెంటనే ఏడుపు ఆపేస్తారట. ఆ గ్రామంలో గిడ్డయ్య కట్ట అనే రచ్చ బండ కూడా ఉంది. ఇంటి పేరు లేకుండా ఎవరినైనా గిడ్డయ్య అని పిలిస్తే ఇంటికొకరు పలుకుతారు.
 
దాదాపు 400 ఏళ్ల క్రితం వెంకటగిరిలో నాలుగు ఇళ్లు మాత్రమే ఉండేవి. గ్రామస్థులు ఒకరోజు సమీపంలోని హంద్రీనీవా నదిని దాటుతుండగా ఆంజనేయ స్వామి తాను నదిలో కూరుకుపోయి ఉన్నానని, దానిని బయటకు తీసి గుడి కట్టిస్తే గ్రామానికి మేలు జరుగుతుందని చెప్పాడు. గ్రామస్థులు అలాగే చేసి, అప్పటి నుండి స్వామి వారిని నిత్యం కొలుస్తున్నారు. గిడ్డ పేరుతో ప్రారంభమయ్యే పేరు పెట్టే విధంగా సాంప్రదాయాన్ని ఏర్పరుచుకున్నారు. గిడ్డ పేరుతో పేరు పెట్టకపోతే ఏదో అరిష్టం జరుగుతుందని వారి ప్రగాఢ నమ్మకం. తమను ఎల్లవేళలా కాపాడుతూ గ్రామాన్ని స్వామి రక్షిస్తున్నాడని వారి అపారనమ్మకం.