శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 16 జనవరి 2016 (18:58 IST)

చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన జయసుధ... హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు చలవే...

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సికిందరాబాద్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నటి అయిన జయసుధ శనివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం నాడు విజయవాడ వచ్చిన ఆమె చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన తర్వాత మాట్లాడుతూ... హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడిదేనన్నారు. ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును ప్రజలు ఎన్నుకోవడం దైవనిర్ణయమని చెప్పుకొచ్చారు. 
 
ఇంకా ఆమె మాట్లాడుతూ...  కాంగ్రెస్ పార్టీకి చాలాకాలం నుంచి దూరంగా ఉన్నానన్నారు. ఇక నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానని చెప్పారు. కాగా 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన జయసుధ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా దిగజారుతుండటంతో ఆమె తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.