శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (15:13 IST)

సచివాలయం అభ్యర్థులకు శుభవార్త.. ఆ మార్కుల్ని తగ్గిస్తారట..

సచివాలయం అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. నోటిఫికేషన్‌లో తెలిపిన ఖాళీలకు తగినంత మంది పరీక్షల్లో ఎంపిక కాకపోతే.. అర్హత మార్కులను తగ్గించే అవకాశం ఉందని ఏపీ సర్కారు అధికారిక వెబ్ సైట్లో ప్రకటించింది. 
 
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షా ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా 1.28 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
 
ప్రభుత్వ పరీక్షలకుగాను 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.  
 
మరోవైపు ఏపీలో గ్రామ వాలంటీర్ పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. గ్రామ వాలంటీర్ పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తయి.. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లాల వారీగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
 
అయితే అర్హులైన అభ్యర్థుల కొరత కారణంగా వివిధ జిల్లాల్లో ఎంపిక చేయలేకపోయారు. కొన్ని చోట్ల ఎంపికైనా అభ్యర్థులు ముందుకురాలేదు. దీంతో దాదాపు 18 వేల గ్రామ వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో మరోసారి జిల్లాలవారీగా మార్గదర్శకాలు రూపొందించి.. ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. 
 
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. అక్టోబరు 2 నుంచి అమల్లోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా సచివాలయాల పరిధిలో లక్షా 26వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.